తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. బుధవారం కుమ్రం భీం- ఆసిఫాబాద్ జిల్లాలో రూ.12.30 కోట్లతో అత్యాధునిక హంగులతో నిర్మించిన 7 నూతన పోలీస్స్టేషన్లను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. కాగజ్ నగర్ పర్యటనలో భాగంగా రూ. కోటి వ్యయంతో నిర్మించిన కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్, రూ. 30 లక్షల వ్యయంతో నిర్మించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయ భవనాలను ప్రారంభించారు.కాగజ్ నగర్ రూరల్ పోలీస్ట్ స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వాంకిడి పోలీస్ స్టేషన్ , కౌటాల పోలీస్ స్టేషన్ ,పెంచికల్ పేట్ , చింతలవానిపల్లి పోలీస్ స్టేషన్ల శిలఫకాలను ఆవిష్కరించి వర్చువల్ ద్వారా నూతన పోలీస్ స్టేషన్ భవనాలను ప్రారంభించారు. అంతకుముందు హరితహారం కార్యక్రమంలో భాగంగా రూరల్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మంత్రులు మొక్కలు నాటారు. అనంతరం రూ. కోటి వ్యయంతో నిర్మించిన రెబ్బన పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని మంత్రులు ప్రారంభించారు.అనంతరం మంత్రులు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన వెంటనే అభివృద్ధితో పాటు పోలీస్ వ్యవస్థ ఆధునీకరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని, ఆయన దిశనిర్ధేశంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ నడుం బిగించిందని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం ద్వారా సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ పోలీసులు కృషి చేస్తున్నారని తెలిపారు.ప్రజల సౌకర్యార్థం పెట్రోలింగ్ వ్యవస్థను పటిష్టపరచడంలో వేలాది పోలీస్ పోస్టులను భర్తీ చేశారని వివరించారు. మంత్రుల వెంట ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, డీజీపీ మహేందర్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ కోవా లక్ష్మి, పోలీస్ హౌజింగ్ కార్పోరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ సురేష్ కుమార్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.