బిజెపిలోకి కాంగ్రెస్ అసమ్మతులు

.. పావులు కదుపుతున్న డీకే అరుణ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఎప్పుడు నియామకం అయ్యాడో అప్పటి నుంచే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు తట్టుకోలేకపోతున్నారు. భగ్గుమంటున్నారు.. వెంకటరెట్టి జగ్గారెడ్డి శశిధర్ రెడ్డి లాంటి వారు ముందు నుంచి టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ కు పగ్గాలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీతోనూ టచ్ లోకి వెళ్లారు. కానీ ఇప్పుడు అధికారికంగా కాంగ్రెస్ సీఎంగా చేసిన మహానేత కుమారుడు బీజేపీలో చేరడానికి రెడీ కావడం కాంగ్రెస్ కు గట్టి షాక్ ఇచ్చినట్టైంది. కాంగ్రెస్ నుంచి ఈ సీనియర్ నేత బీజేపీలో చేరడం ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కు దెబ్బగానే చెప్పొచ్చు.రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన శశిధర్ రెడ్డి కాంగ్రెస్ కు షాకిచ్చాడు. బీజేపీ చీఫ్ బండి సంజయ్ డీకే అరుణతో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటి అయ్యారు. దీంతో ఆయన బీజేపీలో చేరడం ఖాయమైంది. కాషాయ కండువా కప్పుకోవడానికి రెడీ అయిపోయారు. జేపీ నడ్డా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నట్టు సమాచారం.మర్రి శశిధర్ రెడ్డి కొంతకాలంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ లపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. వీరిద్దరి వల్లే కాంగ్రెస్ కల్లోలం అవుతోందని.. కీలక నేతలు వెళ్లిపోవడానికి.. పార్టీ ఓడడానికి వీరే కారణమని ఆరోపించారు. ఈ క్రమంలోనే అసంతృప్తిగా ఉన్న మర్రి ఇప్పుడు పార్టీ మారుతున్నారు.మర్రి చెన్నారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సీఎంగా పనిచేశారు.ఆయన మరణం అనంతరం వారసుడిగా శశిధర్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. వైఎస్ఆర్ హయాంలోనే శశిధర్ రెడ్డికి మంత్రి పదవితోపాటు పార్టీలో గుర్తింపు దక్కింది.సనత్ నియోజకవర్గం నుంచి మర్రి ఏకంగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. 1992,1994,2004,2009 ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతిలో ఓడిపోయారు.
రేవంత్ రెడ్డి తీరు నచ్చకనే మర్రి  పార్టీ మారుతున్నట్టు తెలుస్తోంది. బీజేపీలో చేరాక రేవంత్ నే టార్గెట్ చేయనున్నారు. ఇక కాంగ్రెస్ లోని సీనియర్ నేతలను బీజేపీలోకి చేర్చే బాధ్యతను డీకే అరుణ తీసుకున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ లోని అసమ్మతులు అందరినీ బీజేపీలో చేర్పించడానికి రంగం సిద్ధం చేసినట్టు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.