ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్మోహన్ రెడ్డి పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్రెడ్డి పై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో హెటిరో కంపెనీ కి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. హెటిరోపై దాఖలైన కేసును కొట్టివేయడానికి న్యాయస్థానం నిరాకరించింది. జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసు ప్రస్తుతం సీబీఐ కోర్టులో నడుస్తోందని, ఈ కేసును సీబీఐ దాఖలు చేసినప్పుడు హెటిరో కంపెనీని కూడా సీబీఐ పక్కాగానే చార్జ్షీట్ దాఖలు చేసిందని సుప్రీం కోర్టు పేర్కొంది. ఇవన్నీ దాచేస్తే దాగని నిజాలని ధర్మాసనం పేర్కొంది. జగన్ అక్రమాస్తుల కేసులో.. హెటిరో కంపెనీ విచారణను ఎదుర్కోవాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. తమపై ఉన్న కేసును కొట్టివేయాలని హెటిరో కంపెనీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే హెటిరోపై దాఖలైన కేసు కొట్టివేయతగినది కాదని ధర్మాసనం పేర్కొంటూ.. హెటిరో కంపెనీ పిటిషన్ను డిస్మిస్ చేసింది.