ఏపీలో కార్మికులు, ప్రజా సమస్యలపై నిర్బంధం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఏపీలో కార్మికులు, ప్రజా సమస్యలపై నిర్బంధంపై ఇది ప్రజా ప్రభుత్వమేనా? అన్న అనుమానంగా ఉందని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోపాలగౌడ అన్నారు. ఆదివారం తిరుపతిలో సిఐటియు ఆధ్వర్యంలో “ప్రజా ఉద్యమాలు-నిర్బంధం”పై రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోపాల గౌడ, సిఐటీయు రాష్ట్ర అధ్యక్షుడు సి.హెచ్.నరసింహారావు హాజరయ్యారు. ఈ గోపాలగౌడ మాట్లాడుతూ ఏపీలో ప్రభుత్వం రాజ్యాంగ బద్దంగా నడవడం లేదని విమర్శించారు. పోలీసు నిర్బంధాలపై కోర్టులలో కేసులు వేయాలని కార్మిక సంఘాలకు సూచించారు. పోలీసులు చట్టం ప్రకారం నడుచు కోవాలన్నారు. సీఆర్పీసీ, ఐపీసీ ఉల్లంఘనపై పోలీసు అధికారులపై కోర్టులకు ఎందుకు పిర్యాదు చేయడం లేదని ప్రశ్నించారు. కార్మిక హక్కుల ఉల్లంఘనపై కోర్టు తలుపు తట్టడంలో తప్పు లేదన్నారు. పౌరునిగా ఉన్న ప్రాథమిక హక్కులు రాజ్యాంగ వ్యవస్థ కల్పించిందని, పోలీసు వ్యవస్థ అందుకు అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికులు పనిచేయకపోతే దేశ అభివృద్ధి జరగదని, అలాగే ప్రభుత్వాలు వారి హక్కులను కాలరాయకూడదన్నారు. రైతులు, కార్మికులు ఈ దేశానికి చాలా అవసరమన్నారు. ప్రజా ప్రభుత్వంలో ఆందోళనను పోలీసులు అణగదొక్కడం సిగ్గుచేటని, పోలీసు వ్యవస్థ పరిధికి మించి వ్యవహరించకూడదని మాజీ జస్టిస్ గోపాలగౌడ వ్యాఖ్యానించారు.