విశ్వాస పరీక్షలో నెగ్గిన పంజాబ్లో సీఎం
కొన్ని రోజుల కిందట ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో చేపట్టినట్లుగానే.. పంజాబ్లో సీఎం భగవంత్ మాన్ కూడా విశ్వాస పరీక్ష పెట్టుకుని నెగ్గాడు. మాన్ ప్రభుత్వానికి అనుకూలంగా 93 మంది ఓటేయగా.. వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా నమోదు కాకపోవడం విశేషం.పంజాబ్లో తమ ప్రభుత్వం పట్ల ఆప్ ఎమ్మెల్యేల్లో విశ్వాసం ఉన్నదని స్పష్టం చేసేందుకు భగవంత్ మాన్ విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నాడు. సోమవారం పంజాబ్ అసెంబ్లీలో స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వన్ విశ్వాస పరీక్ష నిర్వహించగా.. 90 మంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటేశారు. ఒక్కరు కూడా మాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయలేదు. దాంతో విశ్వాస తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. శిరోమణి అకాలీదళ్, బీఎస్పీ కూటమి ఎమ్మెల్యేలు సభలోనే ఉన్నప్పటికీ విశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించలేదు. బీజేపీ ఎమ్మెల్యేలు సభకు గైర్హాజరయ్యారు. విశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా జలంధర్కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే శీతల్ అంగురాల్ బీజేపీ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు. విశ్వాస పరీక్ష సందర్భంగా చర్చ దాదాపు 2 గంటలపాటు కొనసాగింది.విశ్వాస పరీక్షపై చర్చను ప్రారంభించిన సీఎం భగవంత్ మాన్ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో అనేక పథకాలు తీసుకురానున్నమని చెప్పారు. తగినంత డబ్బు లేకపోవడంతో చెరుకు రైతులు వరి పంట వైపు వెళ్తున్నారని విచారం వ్యక్తం చేశారు. చెరకు మద్దతు ధరను రూ.360 నుంచి రూ.380 కు పెంచి ఖజానా నుంచి రూ.200 కోట్లు రైతులకు అందజేస్తామన్నారు. మొహాలీ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు మార్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు సీఎం మాన్ చెప్పారు. హల్వారా విమానాశ్రయానికి కర్తార్ సింగ్ సారభా పేరు పెట్టేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. పంజాబ్ ప్రజలు తమపై నమ్మకంతో అధికారం అప్పగించారని, వారి నమ్మకాన్ని నెరవేరుస్తామని సీఎం మాన్ పేర్కొన్నారు.