హనుమంత వాహనంపై పట్టాభిరాముడి అలంకారంలో పద్మావతి అమ్మవారు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన బుధవారం రాత్రి హనుమంత వాహనంపై పట్టాభిరాముడి అలంకారంలో పద్మావతి అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. విశేష సంఖ్యలో హాజరైన భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు.అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్స్వామి, జేఈఓ వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాథం, ఆగమ సలహాదారు శ్రీనివాసచార్యులు, ఆలయ అర్చకులు బాబు స్వామి తదితరులు పాల్గొన్నారు.తిరుచానూరు పద్మావతి అమ్మవారికి కొత్తగా సూర్య ప్రభ వాహనం సమకూరింది. ఆలయంలో సూర్యప్రభ వాహనానికి టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జెఈఓ వీరబ్రహ్మం శాస్రోక్తంగా పూజలు నిర్వహించారు. దాదాపు రూ.3 కోట్ల వ్యయంతో తయారు చేసిన ఈ వాహనంలో 6 కేజీల బంగారాన్ని ఉపయోగించి టీటీడీ సూర్యప్రభ వాహనాన్ని తయారు చేయించింది. పద్మావతి అమ్మవారి వాహన సేవలలో ఈ వాహనాన్ని వినియోగిస్తారు.