రష్యాను ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా ప్రకటించిన ఈయూ పార్లమెంట్‌

తెలంగాణజ్యోతి /వెబ్ న్యూస్: ఉక్రెయిన్‌ యుద్ధాన్ని కొనసాగిస్తున్న రష్యాను ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా ప్రకటించే తీర్మానానికి యూరోపియన్‌ పార్లమెంటు మద్దతు పలికింది. ఉక్రెయిన్‌లో పౌరులే లక్ష్యంగా స్కూళ్లు, దవాఖానలు, విద్యుత్ కేంద్రాలపై రష్యా సైన్యం దాడులకు పాల్పడుతున్నదని, ఇది అంతర్జాతీయ చట్టాలను అతిక్రమించడమేనని స్పష్టం చేసింది. ఈ తీర్మానంపై ఐరోపా పార్లమెంటులో ఓటింగ్‌ నిర్వహించగా.. 494 మంది సభ్యులు మద్దతు పలుకగా, 58 మంది వ్యతిరేకించారు. మరో 44 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. యూరోపియన్‌ పార్లమెంట్‌ రష్యాను ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా తీర్మానించడాన్ని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్వాగతించారు. తమ దేశంపై దురాక్రమణకు పాల్పడుతున్న రష్యా.. ఉక్రేనియన్లే లక్ష్యంగా దాడులు చేస్తున్నందతూ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశాన్ని ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా ప్రకటించాలని అమెరికాతోపాటు ప్రపంచ దేశాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. దీంతో ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం వల్ల ఆర్థికంగా, విద్యుత్‌, చమురు పరంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్న యూరిపియన్‌ దేశాలు ఈ తీర్మానానికి మద్దతు తెలిపాయి. ఈ తీర్మానానికి మద్దతు తెలపడానికి అమెరికా నిరాసక్తత వ్యక్తంచేస్తున్నది.కాగా, ఐరోపా పార్లమెంటు తీర్మానంపట్ల రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. యూరోపియన్ పార్లమెంటును మూర్ఖత్వానికి స్పాన్సర్‌గా నియమించాలని ప్రతిపాదిస్తున్నానని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా వ్యాఖ్యానించారు.

Leave A Reply

Your email address will not be published.