సముద్రతీర విల్లాలో కిమ్ కుమార్తె లగ్జరీ లైఫ్‌..!

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఉత్తర కొరియా, ఆ దేశ నియంత పాలకుడు కిమ్ జోంగ్ ఉన్‌ గురించి ప్రతి విషయమూ ఆసక్తికరమే. ఇటీవల ఆయన క్షిపణి ప్రయోగ ప్రదేశానికి తన కుమార్తెను తీసుకువచ్చి ఆశ్చర్యపరిచారు. జపాన్‌, అమెరికా, దక్షిణ కొరియా దేశాలతో ఉద్రిక్తతలు కొనసాగుతోన్న సమయంలో ఆమెను మొదటిసారి ప్రపంచానికి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన పిల్లలకు అందుతోన్న విలాసవంతమైన జీవితం గురించి న్యూయార్క్‌ పోస్టు కథనం ప్రచురించింది. ఉత్తరకొరియా విశ్లేషకులు వెల్లడించి వివరాలను దీనిలో ఉటంకించింది. కిమ్ ప్రపంచానికి పరిచయం చేసిన కుమార్తె పేరు జుయె(Ju Ae) అని తెలుస్తోంది. ఆమె కాంగ్‌వాన్‌ ప్రావిన్సులోని వాన్సాన్‌ సముద్ర తీరంలో ఉన్న విల్లాలో సకల సౌకర్యాల మధ్య జీవిస్తున్నట్లు వెల్లడించింది. ఈత కొలను, టెన్నిస్ కోర్టు, సాకర్ మైదానం, వాటర్‌స్లైడ్స్, స్పోర్ట్స్ స్టేడియం ఉన్నట్లు తెలిపింది. ‘ఆమె అందమైన జీవితం గడుపుతున్నారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకునేందుకు పెద్దసంఖ్యలో సహాయక సిబ్బంది ఉన్నారు. అలాగే ఎక్కువ సమయం వారి తల్లిదండ్రులతోనూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇక కిమ్‌ తండ్రి చాలా కఠినంగా ఉండేవారు. కానీ తన పిల్లల పట్ల మాత్రం ఎంతో శ్రద్ధ చూపేవారు’ అని మైఖెల్ మాడెన్‌ అనే విశ్లేషకుడు వెల్లడించారు. కిమ్ కుటుంబానికి దేశవ్యాప్తంగా విలాస సౌధాలు 15 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. సొరంగమార్గాల్లోనే వాటి మధ్య ప్రయాణిస్తారట. అందుకోసం భూగర్భంలో రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. కిమ్ కుటుంబ కదలికలు శత్రుదేశాల దృష్టిలో పడకుండా ఉండేందుకే ఇలా కట్టుదిట్టంగా వ్యవహరిస్తారని ఆ కథనం తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.