ఆడుకుంటూ వెళ్లి రైలు ఢీకొన్న చిన్నారులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఆడుకుంటున్న చిన్నారులు రైలు ఢీకొట్టి ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన పంజాబ్‌లో ఆదివారం చోటుచేసుకుంది. రూప్‌నగర్‌లోని శ్రీ కిరాత్‌పూర్ సాహిబ్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు చనిపోయారు. మరో బాలుడు గాయపడ్డాడు. రోడ్డు దాటుతున్న పిల్లలపై (Children) నుంచి ప్యాసింజర్ రైలు (Train) వెళ్లడంతో తీవ్రంగా గాయపడిన ముగ్గురూ అక్కడికి అక్కడే మృతిచెందారు. సట్లెజ్ నది వంతెన సమీపంలోని రైల్వే ట్రాక్‌కు సమీపంలో నలుగురు వలస కూలీల పిల్లలు ఆడుకుంటుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో గాయపడి మరో బాలుడ్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.మృతుల వయసు 7 నుంచి 11 ఏళ్ల మధ్య ఉంటుంది. కాగా, ఈ ఘటనపై పంజాబ్ పాఠశాల విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన.. ఘటనపై విచారణకు ఆదేశించారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ డిమాండ్ చేశారు. ‘‘ఈరోజు శ్రీ కిరాత్‌పూర్ సాహిబ్ సమీపంలో ప్యాసింజర్ రైలు నలుగురు పిల్లలను ఢీకొట్టడంతో వారిలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు అనే వార్త విని కలత చెందాను.. బాధిత కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను.. కుటుంబాలకు తగిన పరిహారం అందించాలని పంజాబ్ ప్రభుత్వాన్ని కోరుతున్నాను’’ అని అమరీందర్ సింగ్ ట్వీట్ చేశారు.శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ కూడా ఘటనపై విచారం తెలిపారు. ‘‘కిరాత్‌పూర్ సాహిబ్ సమీపంలో రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొని ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని విని చాలా బాధపడ్డాను.. ఆ అమాయక చిన్నారుల ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ కోలుకోలేని నష్టాన్ని తట్టుకునే శక్తిని కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని గురుసాహబ్‌ని ప్రార్థిస్తున్నాను’’ అని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.