ఆంధ్రప్రదేశ్ లో కెసిఆర్ కి ఎవరు మద్దతుగా నిలుస్తారు

కేసీయార్ జాతీయ పార్టీ మీద ఇపుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. దసరా శుభ ముహూర్త వేళ ఆయన కొత్త జాతీయ పార్టీని పెట్టేందుకు ముహూర్తం సెట్ చేసి పెట్టుకున్నారు. ఈ విషయంలో క్లారిటీ కూడా ఇచ్చేశారు. ఇక పార్టీ పెట్టడమే తరువాయి అన్నట్లుగా కధ సాగుతోంది. అయితే సాటి తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లో కేసీయార్ కొత్త పార్టీ ప్రభావం ఎంత అన్నదే ఇపుడు ఆసక్తికరమైన చర్చగా ఉంది.
కేసీయార్ జాతీయ రాజకీయాల మీద మక్కువతో  ఇప్పటికే దేశమంతా తిరిగి వచ్చారు. ఆయన అనేక రాష్ట్రాలలో పర్యటనలు చేసి అక్కడ రాజకీయ నాయకులను కలుసుకుని చర్చలు జరిపారు. అయితే ఏపీకి మాత్రం కేసీయార్ ఇప్పటిదాకా రాలేదు. ఆయన జాతీయ పార్టీ పెడితే ఏపీలో తప్పకుండా అడుగుపెట్టాల్సి ఉంటుంది.మరి ఆ విధంగా చూస్తే ఏపీ నుంచి కేసీయార్ కి ఎవరు మద్దతుగా నిలుస్తారు. ఎవరు ఆయనతో చేతులు కలుపుతారు అన్నది పెద్ద చర్చగా ఉందిపుడు. నిజానికి కేసీయార్ కి జగన్ జిగినీ దోస్తు అని అంతా అంటారు. ఏపీ సీఎం గా జగన్ ఉండాలని కేసీయార్ అప్పట్లో బలంగా కోరుకున్నారు. కానీ గత కొన్నాళ్ళుగా సీన్ మారింది. జగన్ తన దారి తనది అంటూంటే కేసీయార్ కూడా రూట్ మార్చేశారు.ఇక ఏపీ సీఎం జగన్ బీజేపీకి మద్దతుగా ఉన్నారు. ఈ మధ్యనే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణారెడ్డి అయితే తమది జాతీయ స్థాయిలో ఒంటరి పోరే అని చెప్పారు. ఏ ఫ్రంట్లతోనూ తాము జట్టు కట్టబోమని కూడా తేల్చి చెప్పేశారు. ఆ విధంగా చూసుకుంటే ఏపీలో కేసీయార్ జాతీయ పార్టీ పేరిట ఎంట్రీ ఇచ్చినా ఆయనతో చేతులు కలిపేందుకు జగన్ కచ్చితంగా ఇష్టపడరనే అంటున్నారు.మరో వైపు చూస్తే బీజేపీతో జగన్ కి పెద్ద పనే ఉంది అంటున్నారు. మోడీ అమిత్ షాలతో జగన్ సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. 2024 ఎన్నికల తరువాత కేంద్రంలో బీజేపీకి సీట్లు తగ్గితే తమ ఎంపీల మద్దతు ఇచ్చి బీజేపీని ఆదుకోవాలని జగన్ చూస్తున్నట్లుగా కూడా ప్రచారం సాగుతోంది. దాంతో తెలంగాణాలో తప్ప ఎక్కడా ఉనికిలో లేని కేసీయార్ జాతీయ పార్టీకి జగన్ ఎందుకు మద్దతు ఇస్తారు అన్నది ఇపుడు కీలకమైన ప్రశ్నగా ముందుకు వస్తోంది.పోనీ తెలుగుదేశం నుంచి అయినా కేసీయార్ కి మద్దతు వస్తుందా అంటే అది జరిగే పని కాదు అని అంటున్నారు. చంద్రబాబును ఉమ్మడి ఏపీ సీటు నుంచి దించేందుకు కేసీయార్ నాడు చాలా చేసారు. ఆయన టీయారెస్ పెట్టకపోయి ఉంటే చంద్రబాబు 2004లో మళ్ళీ సీఎం గా గెలిచేవారు అన్న లెక్కలు కూడా టీడీపీ వద్ద ఉన్నాయి. ఇక చంద్రబాబును గురువుగా కేసీయార్ ఒప్పుకోరు కేసీయార్ ని శిష్యుడిగా చేరదీయడానికి బాబుకు మనసొప్పదు.పైగా 2019 ఎన్నికల్లో జగన్ కి మద్దతు ఇచ్చి తనను ఓడించి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన కేసీయార్ అంటే చంద్రబాబు ఎందుకు ఇష్టపడి జాతీయ పార్టీకి జై కొడతారు అని కూడా అంటున్నారు. ఇక చంద్రబాబు తానుగా టీడీపీకి జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. అలాంటి ఆయన మొరో జాతీయ పార్టీతో చేతులు కలపడం అసంభవం అంటున్నారు. సో టీడీపీ నుంచి కూడా మద్దతు ఉండదనే చెప్పాలి.ఇక తీసుకుంటే జనసేన మూడవ పార్టీగా ఉంది. అయితే పవన్ కేసీయార్ విధానాలను పాలనను పొగుడుతారు కానీ అదంతా తెలంగాణాకే పరిమితం. ఏపీ వద్దకు వచ్చేసరికి పవన్ బీజేపీతోనే కలసి అడుగులు వేస్తున్నారు. ఆయన పొత్తులోకి వెళ్తే అది టీడీపీతో మాత్రమే అని అంటున్నారు. ఈ విధంగా ఆలోచించినపుడు మూడు ప్రధాన పార్టీలు ఏపీలో కేసీయార్ కొత్త పార్టీతో జత కలిసేది లేదు అన్నదే ఇప్పటికి అందుతున్న సమాచారం. మరి కేసీయార్ ఏపీలో ఎంట్రీ ఇచ్చి తన రాజకీయాన్ని ఎలా నెట్టుకువస్తారు అన్నదే ఆలోచించాలని అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.