తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సీఎం పదవి నాకు కొత్తా అని టీడీపీ నేత చంద్రబాబు ప్రశ్నించారు. ఒక సైకో ఊరికో సైకో తయారుచేస్తున్నాడని దుయ్యబట్టారు. నిడదవోలులో చంద్రబాబు ‘ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి‘ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో సైకో పాలన కొనసాగుతోందన్నారు. ఇంత నీచమైన సీఎంను తన రాజకీయ జీవితంలో చూడలేదని, ఒక సైకో ఊరికో సైకోను తయారుచేస్తున్నాడని మండిపడ్డారు. ఏ తప్పూ లేకపోయినా అమరరాజా బ్యాటరీస్ పై కేసులు పెట్టారని, కేసులపై కేసులు పెడుతూ మాజీమంత్రి నారాయణ ను వేధిస్తున్నారని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తిచేయాలని నిరంతరం పనిచేశానని, రైతుల పొలాలకు నీరు ఇచ్చేందుకు ఎంతో దూరదృష్టితో వ్యవహరించానని చంద్రబాబు గుర్తుచేశారు. జగన్రెడ్డి సర్కార్ పోలవరం ప్రాజెక్ట్ను గోదావరి నదిలో కలిపేసిందని దుయ్యబట్టారు. ఏపీకి జీవనాడి లాంటి పోలవరాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. డ్వాక్రా సంఘాలను సీఎం జగన్రెడ్డి నిర్వీర్యం చేశారని పేర్కొన్నారు. పరదాలు, పోలీసులను అడ్డుపెట్టుకుని జగన్రెడ్డి పాలన చేస్తున్నారని చంద్రబాబు ఎద్దేవాచేశారు.