నూతన జిల్లాల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నూతన జిల్లాల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు పెరిగాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని 30వ వార్డులో రూ.2.10 కోట్లతో నిర్మించనున్న సీసీ రహదారికి, నాగవరం తండా సమీపంలో రూ.25 లక్షలతో 29 గుంటలలో నిర్మించబోయే రిజిస్ట్రేషన్ కార్యాలయానికి మంత్రి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రం భౌగోళికంగా నలువైపులా వేగంగా విస్తరిస్తుందని వివిధ రకాల ద్విచక్ర వాహనాలు, కార్ల షోరూంలు, మార్కెట్లు, మాల్స్ ఏర్పాటు అవుతున్నాయని తెలిపారు.దానికి అనుగుణంగా మౌళిక సదుపాయాలను ఏర్పాటుచేస్తామని వెల్లడించారు. ఏడాదిన్నరలోపు వనపర్తి సమీపంలో ఆహారశుద్ధి పరిశ్రమలు నెలకొల్పుతామన్నారు.సీఎం కేసీఆర్ అద్భుతమైన ఆలయం నిర్మించారని, స్థానికంగా ఆలయాల నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని వెల్లడించారు. ఈ నెల 12 తర్వాత వనపర్తిలోని ప్రతి రోజూ రెండు వార్డుల చొప్పున పర్యటించి సమస్యలు పరిష్కరిస్తానని వివరించారు.అంతర్గత రహదారులు ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని అన్నారు. అంతకు ముందు భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు.