ఎన్నారై మెడికల్ కళాశాల సోదాల్లో మొత్తం 53 చోట్ల స్థిరాస్తులను గుర్తింపు
- ప్రకటనను విడుదల చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఎన్నారై మెడికల్ కళాశాల సోదాల కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బుధవారం ప్రకటనను విడుదల చేసింది. ఈ సోదాల్లో మొత్తం 53 చోట్ల స్థిరాస్తులను ఈడీ గుర్తించింది. విజయవాడ, కాకినాడ, గుంటూరు, హైదరాబాద్లో రెండు రోజుల పాటు అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నెల 2, 3 తేదీల్లో సోదాలు జరిగాయి. ఏపీ పోలీసులు నమోదు చేసిన కేసులో భాగంగా పీఎమ్ఎల్ఏ ఈడీ కేసు నమోదు చేసింది. నగదు, కీలక పత్రాలు, పలు ఆస్తులు సీజ్ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఎన్ఆర్ఐ సొసైటీకి చెందిన నిధులను భవన నిర్మాణాలు పేరుతో దుర్వినియోగం చేశారని.. కోవిడ్ సమయంలో రోగుల నుంచి భారీగా నగదు వసూలు చేశారని పేర్కొంది. కోవిడ్ నుంచి వచ్చిన ఆదాయాన్ని ఎన్ఆర్ఐ సొసైటీ ఖాతాల్లో చూపించలేదని గుర్తించినట్లు తెలిపింది. ఎమ్బీబీఎస్ విద్యార్థుల నుంచి పెద్ద మొత్తంలో అడ్మిషన్ల పేరుతో వసూళ్ళు చేశారని… ఇలా వచ్చిన ఆదాయాన్ని దారి మళ్లించినట్లు ఈడీ వెల్లడించింది. ఎన్ఆర్ఐ సొసైటీ ఖాతా నుంచి ఎన్ఆర్ఐఏఎస్ అనే మరో ఖాతాకు బదిలీ చేసినట్లు గుర్తించామని ఈడీ పేర్కొంది.