రాజా సింగ్ హాట్ కామెంట్స్..పోలీసు కేసు నమోదు!

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  తెలంగాణలో బీజేపీ ఫైర్ బ్రాండ్ ఘోషా మహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటీవలే అతి కష్టం మీద బెయిల్ పై బయటకు వచ్చారు. తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలోను.. మతాల మధ్య ఘర్షణలు పెడుతున్నారనే అభియోగం మేరకు ఆయనపై పోలీసులు కేసులు పెట్టడం.. ఆయన సతీమణి గవర్నర్ను కలిసి విన్నవించడం..బీజేపీ నుంచి ఆయనను సస్పెండ్ చేయడం అంతా తెలిసిందే.అయితే.. బెయిల్ పై వచ్చిన తర్వాతైనా.. రాజాసింగ్ కుదురుగా ఉన్నారా? అంటే లేనే లేరు. తాజాగా మరోసారి నోటి దూల తీర్చేసుకున్నారు. దీంతో మంగళహాట్ పోలీస్ స్టేషన్లో రాజాసింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్విటర్లో రాజాసింగ్ అయోధ్య పై పోస్టు చేశారు. ఈ వ్యాఖ్యల పై సంజాయిషీ ఇవ్వాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు.అంతేకాదు.. గత కేసుల్లో  హైకోర్టు పెట్టిన షరతులను ఉల్లంఘించారని సదరు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులకు రాజాసింగ్ తరఫు న్యాయవాది సంజాయిషీ ఇచ్చారు. అయితే నోటీసుల్లోని అంశాలు సంతృప్తి కరంగా లేవని పోలీసులు చెప్పారు. న్యాయ నిపుణులతో సంప్రదించి చర్యలు తీసుకుంటామన్నారు.మరో వైపు తనపై పోలీసులు కేసు నమోదు చేయడం పై రాజాసింగ్ స్పందించారు. బాబ్రీ మసీదు పై ఒవైసీ సోదరులు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని చెప్పారు. వాళ్ల పై ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు.తనకు ఒక న్యాయం.. వారికొకన్యాయమా? అని నిలదీశారు. అధికారుల మెప్పు పొందేందుకే తనపై కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. మరి ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి.

Leave A Reply

Your email address will not be published.