వైశాలి కిడ్నాప్ కేసులో బిగ్ ట్విస్ట్
- నవీన్ రెడ్డి స్టేట్మెంట్లో వెలుగులోకి కీలక విషయాలు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో జరిగిన యువతి కిడ్నాప్ వ్యవహారం తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పట్టపగలు దాదాపు 100 మందితో వచ్చిన మిస్టర్ టీ ఓనర్ నవీన్ రెడ్డి హంగామా చేసి.. డెంటల్ డాక్టర్ వైశాలిని కిడ్నాప్ చేయటంతో ఈ కేసు నగరమంతా చర్చనీయాంశంగా మారింది. ఈ దాడిలో అడ్డువచ్చిన యువతి తల్లిదండ్రులతో పాటు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకున్న పోలీసులు.. 6 గంటల్లోనే రెస్క్యూ చేసి వైశాలని కాపాడారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా యువతి ఏపీ తెలంగాణ బోర్డర్లో ఉందని గుర్తించి కిడ్నాపర్ల బారి నుంచి రక్షించారు. కిడ్నాప్కు పాల్పడిన మిస్టర్ టీ ఓనర్ నవీన్ రెడ్డితో పాటు మరో 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వైశాలి కుటుంబ సభ్యులపై దాడి, ఆస్తుల ధ్వంసంతో నిందితులపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి షాకింగ్ పోలీసులకు షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. గతేడాది వైశాలితో తనకు పెళ్లి జరిగిందని స్టేట్మెంట్లో వెల్లడించారు. 2021 ఆగస్ట్లో తమకు హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగిందని చెప్పాడు. 2021 ఆగస్ట్ 4న బాపట్ల జిల్లా వలపర్ల ఆలయంలో తమ వివాహం జరిగిందని చెప్పాడు. అయితే బీడీఎస్ పూర్తయ్యే దాక పెళ్లి ఫొటోలను బయటకు రానీయవద్దని వైశాలి కండీషన్ పెట్టిందిని స్టేట్మెంట్లో వెల్లడించాడు. వైశాలి కండీషన్ మేరకే తాను ఫోటోలను లీక్ చేయలేదని నవీన్ రెడ్డి వెల్లడించారు. వైశాలి తల్లితండ్రులు కూడా బీడీఎస్ పూర్తవగానే పెళ్లి చేస్తామని మాట ఇచ్చారని, ఇప్పుడు ఆ మాట తప్పారని ఆరోపించారు. వైశాలి కుటుంబ సభ్యులు పెళ్లి పేరు చెప్పి తనతో డబ్బులు ఖర్చు పెట్టించారన్నారు. తన డబ్బుతో వైజాగ్, అరకు, వంజంగి, మంగుళూరు, కూర్గ్, గోవా, గోకర్ణా వెళ్లారని చెప్పారు. వైశాలి పేరు మీద ఖరీదైన వోల్వో కారు, వైశాలి తండ్రి దామోదర్ రెడ్డి పేరు మీద రెండు కాఫీ షాపులను రిజిస్ట్రేషన్ చేయించినట్లు స్టేట్మెంట్లో నవీన్ రెడ్డి వెల్లడించారు.