నిందితుల కస్టడీ పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. రేపు కోర్టుకు నవీన్‌రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్:  ఆదిభట్ల పోలీసుస్టేషన్‌ పరిధిలోని మన్నెగూడకు చెందిన వైశాలి కిడ్నాప్‌ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్‌పై విచారణ ముగిసింది. ఈ కేసుకు సంబంధించి దాడిలో పాల్గొన్న 32 మంది హస్తినాపురం కేశవపురి కాలనీలోని మిస్టర్‌ టీ ప్రధాన కార్యాలయంలో శనివారం సమావేశమైనట్లు సమాచారం అందుకుని పోలీసులు వారిని అరెస్టు చేశారు. వీరిలో నాగారం భానుప్రకాశ్‌ (20), రాథోడ్‌ సాయినాథ్‌ (22), గానోజి ప్రసాద్‌ (25), కోతి హరి (30), బోని విశ్వేశ్వర్‌రావు (26)లను కస్టడీకి ఇవ్వాలని ఆదిభట్ల పోలీసులు ఇబ్రహీంపట్నం కోర్టులో మంగళవారం పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం.. తీర్పును రేపటికి వాయిదా వేసింది.

మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి మంగళవారం గోవాలో పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. నవీన్‌ రెడ్డిని హైదరాబాద్‌ తీసుకొచ్చిన పోలీసులు.. రేపు కోర్టులో హాజరుపర్చనున్నారు. నవీన్‌రెడ్డితో పాటు మరో ఐదుగురిని పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. చందు, ప్రవీణ్‌, ప్రకాశ్‌, మహేశ్‌, యశ్వంత్‌లను అరెస్టు చేసి ఇబ్రహీంపట్నం కోర్టులో హాజరుపరిచారు.

Leave A Reply

Your email address will not be published.