వాహనం తిరిగిన దూరం ఆధారంగా టోల్ వసూలు
కేంద్ర ప్రభుత్వం టోల్ విధానాన్ని ప్రక్షాళన చేస్తున్న క్రమంలో ఇక నుంచి హైవేలపై వాహనం పరిమాణం, వాహనం తిరిగిన దూరం ఆధారంగా టోల్ వసూలు చేసే విధానం అమల్లోకి రానుందని చెబుతున్నారు. యూజర్లు వాడిన విద్యుత్కు ఎలాగైతే బిల్లు చెల్లిస్తారో అదే తరహాలో వాహనం సైజు, రోడ్డుపై అది ప్రయాణించిన దూరం ఆధారంగా జాతీయ రహదారులపై టోల్ వసూలు చేస్తారు.టోల్ వసూళ్ల ప్రక్రియ మరింత సమర్ధంగా ఉండేలా టోల్ విధానాన్ని ప్రక్షాళన చేయాలని కేంద్రం యోచిస్తోంది. నూతన విధానానికి అనుగుణంగా వాహనం హైవేలపై ఎంత సమయం, ఎంత దూరం ప్రయాణించిందనే దాని ఆధారంగా టోల్ వసూలు చేస్తారు.కాగా 60 కిలోమీటర్ల పరిధిలో ఉండే ప్రతి కలెక్షన్ పాయింట్స్ వద్ద టోల్ ట్యాక్స్ వసూలు చేయబోరని రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ దూరంలో ఉండే ఇతర కలెక్షన్ పాయింట్స్ను మూసివేస్తామని మంత్రి పేర్కొన్నారు. కాగా మంత్రి ప్రతిపాదనపై పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లోనూ ప్రతిపక్షాలు ఈ అంశాన్ని లేవనెత్తాయి.