కెసిఆర్ మరోసారి మొహం చాటేస్తారా?
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరోసారి మొహం చాటేస్తారా? తాజా పరిస్థితులు చూస్తుంటే ఔననే అనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ అధినాయకత్వంతో విభేదాలు మొదలైనప్పటినుంచీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ని కలిసేందుకు కేసీఆర్ ఆసక్తి చూపడం లేదు. ప్రధాని అధికారిక పర్యటనల్లో భాగంగా రాష్ట్రానికి వచ్చినా కేసీఆర్ కలవడానికి ఇష్టపడలేదు. ప్రొటోకాల్ పాటించలేదు.తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 26న తెలంగాణకు తొలిసారి వస్తున్నారు. రాష్ట్రపతిగా ఎన్నికయ్యాక ఆమె తొలిసారిగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా బొల్లారంలోని రాష్ట్రపతి భవన్లో బస చేస్తారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా ముర్ము అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రామప్ప, భద్రాచలం ఆలయాలను సందర్శించనున్నారు. శంషాబాద్ సమీపంలోని కన్హా ఆశ్రమంలో రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో ముర్ము పాల్గొంటారు. ఈ కార్యక్రమాల్లో ముర్ముతో పాటు కేసీఆర్ పాల్గొనకపోవచ్చని సమాచారం.