బాలింత అయి వుండి కూడా బాధ్యతను మరిచిపోని మహిళా ఎమ్మెల్యే
- పసిబిడ్డతో అసెంబ్లీ సమావేశాలకు హాజరు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/మహారాష్ట్ర: ఓ మహిళా ఎమ్మెల్యే నెలల వయసున్న తన పసిబిడ్డను తీసుకుని అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. బాలింత అయి వుండి కూడా బాధ్యతను మరిచిపోకుండా అసెంబ్లీకి వచ్చిన ఆ మహిళా ఎమ్మెల్యేపై సాటి ఎమ్మెల్యేలు అభినందనల వర్షం కురిపించారు. ఇవాళ మహారాష్ట్ర అసెంబ్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది.నాగ్పూర్కు చెందిన మహిళా ఎమ్మెల్యే సరోజ్ బాబూలాల్ అహిరే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకురాలు. గత సెప్టెంబర్ 30న ఆమె ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ క్రమంలో మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. దాంతో ఆమె మూడు నెలలు కూడా నిండని పసిబిడ్డను తీసుకుని అసెంబ్లీకి వచ్చారు.కరోనా మహమ్మారి కారణంగా గత రెండున్నర సంవత్సరాలుగా మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగలేదని, అందుకే ఇప్పుడు బాలింతను అయినా సమావేశాలకు హాజరుకావాల్సి వచ్చిందని సరోజ్ అహిరే చెప్పారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి అసెంబ్లీకి హాజరుకాకుండా ఉంటే ప్రజలకు తాను ఏం సమాధానం చెప్పగలనని, అందుకే కష్టమే అయినా వీలు చేసుకుని సమావేశాలకు వచ్చానని ఆమె చెప్పారు.