కలవర పెడుతున్న కరోనా కొత్త వేరియంట్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బ్యూరో చీఫ్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్.7 కలవర పెడుతోంది. చైనాతో పాటు అమెరికా, బ్రిటన్‌, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్‌, డెన్మార్క్‌ వంటి ఐరోపా దేశాల్లోనూ ఈ వేరియంట్‌ కేసులు ఇప్పటికే వెలుగు చూశాయి. వైరస్‌ భారత్‌లోకి కూడా ప్రవేశించింది. దేశవ్యాప్తంగా ఈ రకానికి చెందిన కేసులు నాలుగు నమోదయ్యాయి. తొలి కేసును గుజరాత్‌ బయోటెక్నాలజీ రీసెర్చ్‌ సెంటర్‌ అక్టోబరులో గుర్తించింది. తాజాగా గుజరాత్‌లో రెండు, ఒడిశాలో ఒకటి వెలుగు చూశాయి. దీంతో భారత్ అప్రమత్తమైంది. కొవిడ్ నియంత్రణకు అవసరమైన ముందు జాగ్రత్త చర్యలను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని., కొవిడ్‌ ప్రొటోకాల్ కచ్ఛితంగా పాటించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం హెచ్చరికలతో తెలంగాణ ప్రభుత్వం కరోనా నియంత్రణపై ప్రత్యేక దృష్టిసారించింది. ప్రజలు సామాజిక దూరం పాటించటంతో పాటు వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని సూచిస్తోంది. జన సమూహాలు ఉండే ప్రాంతాల్లో మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలని ఆదేశాలిచ్చింది. ప్రస్తుతానికి తెలంగాణలో కొత్త వేరియంట్ భయం లేదని.., కొవిడ్ బులిటెన్‌ ప్రకారం కరోనా కేసుల్లో పెరుగుదల లేకపోవడంతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాని చెప్పారు. డిసెంబర్ 20 నాటికి తెలంగాణలో కరోనా బాధితుల కేసుల సంఖ్య 34 కాగా, రికవరీ రేటు 99.51 శాతంగా ఉందని ప్రభుత్వం చెప్పింది. ప్రజలు ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులపై కేంద్రం నిఘా ఉంచింది. వారికి కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దేశంలోని ప్రధాన విమానశ్రయాలైన ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరుతో పాటు.. హైదరాబాద్‌ విమానశ్రయాల్లో కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది. గత కొద్దిరోజులుగా విదేశాల నుంచి వచ్చిన వారి జాబితా సేకరించి.. వారిలో ఆరోగ్య లక్షణాలు ఆధారంగా పరీక్షలు చేసేందుకు వైద్యారోగ్య శాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు. కొవిడ్ లక్షణాలు ఉన్నవారు హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని.., కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. విదేశీ ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయితే నమూనాలను జీనోమ్‌ సీక్వెన్స్‌కి పంపనున్నట్లు అధికారులు తెలిపారు. ఒమిక్రాన్ కొత్త వేరియంట్‌పై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఇవాళ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. కేంద్రం సూచనల మేరకు రాష్ట్రంలో కొవిడ్‌ టెస్టుల సంఖ్యను పెంచాలని నిర్ణయించారు. హైదరాబాద్‌కు విదేశీ ప్రయాణికుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని చర్యలకు సిద్ధమయ్యారు. విమానాశ్రయంలోనూ వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాలణికులకు పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.