ఖండాంతరాలు దాటిన ప్రేమ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బ్యూరో చీఫ్: ప్రస్తుత రోజుల్లో ప్రేమకు ఏదీ అడ్డుకాదని చాలామంది యువత నిరూపిస్తున్నారు. ఒకప్పుడు ప్రేమ వివాహాలు ప్రోత్సహించని తల్లిదండ్రులు సైతం.. పిల్లల ఇష్టప్రకారం పెళ్లిళ్లు జరిపిస్తున్నారు. కులాలు, మతాలే కాదు దేశాలు వేరైనా పిల్లల ప్రేమను అంగీకరిస్తున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో జరిగింది. ఇక్కడ అమ్మాయి.. అక్కడి అబ్బాయి మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన మేఘన చిన్నతనంలోనే అమెరికాలోని న్యూయార్క్ సిటీకి వెళ్లింది. అక్కడ గ్రేగారీ అనే అబ్బాయితో పరిచయం ఏర్పడింది. చిన్ననాటి నుంచి కలిసి తిరిగిన వాళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు. 26 సంవత్సరాల పరిచయాన్ని పరిణయంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. ఇరువురు ప్రేమను అర్థం చేసుకున్న తల్లిదండ్రులు వారి పెళ్లికి ఓకే చెప్పారు. దీంతో శామీర్ పేట అలంకృతి రిసార్ట్‌లో గత రాత్రి ఘనంగా వీరి వివాహం జరిగింది. తెలుగు సాంప్రదాయం ప్రకారం మూడు ముళ్లు, ఏడు అడుగులతో ఇరువురూ ఒక్కటయ్యారు. తమ పిల్లలు ఒకర్నొకరు అర్థం చేసుకొని వివాహ బంధంలోకి అడుగు పెట్టారని వారి తల్లిదండ్రులు చెబుతున్నారు. మనసుకు నచ్చి వారితో జీవితం కొనసాగించాలని నిర్ణయించుకుంటే రంగు, దేశాలతో పని లేదని అంటున్నారు. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండి కలసి జీవించగలం అని వారి మనసుకు అనిపిస్తే.. ఆ బంధం చిరకాలం కొనసాగుతుందని చెప్పారు. గ్రేగారీ లాంటి అబ్బాయి దొరకటం తమ అమ్మాయి చేసుకున్న అదృష్టమని వధువులు తల్లిదండ్రులు చెబుతున్నారు. వారి ఈ ప్రేమ పెళ్లి చేయడం తమకు ఎంతో సంతోషంగా ఉందటున్నారు.

Leave A Reply

Your email address will not be published.