కేంద్రాన్ని బదనాం చేసేందుకే టీఆర్ఎస్ ధర్నాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కేంద్రాన్ని బదనాం చేయడమే లక్ష్యంగా టీఆర్ఎస్ ధర్నాల పర్వం కొనసాగిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

నరేగా చట్టంపై టీఆర్ఎస్ నేతలకు కనీస అవగాహన లేకపోవడం సిగ్గు చేటు అన్నారు.

వ్యవసాయ, అనుబంధ రంగాలను ఉపాధి హామీ అనుసంధానించడం సాధ్యం కాదనే సంగతి తెలియదా? అని ప్రశ్నించారు.

ఉపాధి హామీ నిధులను దారి మళ్లించిన టీఆర్ఎస్ దొంగలు… లెక్కలడిగితే సెంటిమెంట్ తో రెచ్చగొట్టాలనుకుంటున్నారు

రుణమాఫీ, ఫ్రీ యూరియాసహా రైతులకు ఇచ్చిన హామీలెందుకు అమలు చేయడం లేదంటూ టీఆర్ఎస్ నేతల ‘రైతు ధర్నా’లపై బండి సంజయ్ ఫైర్ అయ్యారు.

వ్యవసాయ, అనుబంధ రంగాలను మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంతో అనుసంధానించాలని కోరుతూ టీఆర్ఎస్ నేతలు ఇయాళ ధర్నాలు చేయడం హాస్యాస్పదం. టీఆర్ఎస్ నాయకులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు జాతీయ ఉపాధి హామీ చట్టంపై ఏమాత్రం అవగాహన లేదని అర్ధమవుతోంది. కనీసం ఆ చట్టంలో ఏముందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం సిగ్గు చేటు అన్నారు.

వ్యవసాయ అనుబంధ రంగాలు జాతీయ ఉపాధి చట్టం పరిధిలోకి రానేరావు. నీటిపారుదల కార్యకలాపాలు, నీరు మరియు భూమి అభివృద్ధి పనులు, చిన్న నీటిపారుదల పనులు మాత్రమే చట్టంలోని షెడ్యూల్ 4(3)లో భాగంగా ఉన్నాయి.

2005లో ఈ మేరకు చట్టం చేశారు. 17 ఏండ్ల తరువాత ఆ చట్టంలో లేని అంశాలపై ధర్నాలు చేస్తూ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తుండటం టీఆర్ఎస్ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం.

వాస్తవానికి జాతీయ ఉపాధి హామీ పథకం వేతనాల్లో భాగంగా విడుదలైన రూ.161 కోట్ల నిధులను కేసీఆర్ ప్రభుత్వం దారి మళ్లించింది. ఇందులో అవినీతి జరిగిందని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆ నిధులను వెంటనే వాపస్ చేయాలని కోరడంతో అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఈ మహా ధర్నా చేస్తూ తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి లబ్ది పొందాలని యత్నిస్తుండటం శోచనీయం.

రైతులపట్ల మొసలి కన్నీరు ఒలకపోస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదు? రుణ మాఫీని ఎందుకు అమలు చేయడం లేదు? రైతులందరికీ ఉచితంగా ఎరువులు అందిస్తానన్న హామీ ఏమైంది? కౌలు రైతులకు ‘‘రైతు బంధు’’ ఎందుకు అమలు చేయడం లేదు?

ఏటా వేలాది మంది రైతులు అకాల వర్షాలతో పంట నష్టపోతుంటే వారికి ఇంతవరకు నష్ట పరిహారం ఎందుకు ఇవ్వడం లేదు? కేంద్రం ప్రవేశపెట్టిన ‘ఫసల్ బీమా యోజన’ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయకుండా తెలంగాణ రైతాంగానికి నష్టం చేస్తోంది టీఆర్ఎస్ కాదా? రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదని గగ్గోలు పెడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం వారికి ప్రత్యేకంగా బోనస్ ఎందుకు ప్రకటించడం లేదు?

రైతుల ఆత్మహత్యలను ఎందుకు అపలేకపోయారు? ఇక్కడ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వకుండా రాష్ట్ర ప్రజల సొమ్మును పంజాబ్ రైతులకు పంచడం ఎంత వరకు న్యాయం? చివరకు పంజాబ్ రైతులకు చెల్లని చెక్కులిచ్చి తెలంగాణ పరువు తీయడం ఎంతవరకు సమంజసం?

రైతుల సంక్షేమానికి కేంద్రం అనేక చర్యలు చేపడుతున్నా బదనాం చేయడం ఎంతవరకు న్యాయం? అంతర్జాతీయ మార్కెట్ ఎరువుల ధరలు అమాంతం పెరిగినప్పటికీ రైతులపై భారం పడకూడదనే ఉద్దేశంతో సబ్సిడీపై తక్కువ ధరకు ఎరువులు అందిస్తున్న ఘనత మోదీ ప్రభుత్వానిది. కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తోంది. కనీస మద్దతు ధరను ఏటా పెంచుతూ రెట్టింపు చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది.

రాష్ట్రంలో ఎరువుల కొరత ఉండకూడదనే ఉద్దేశంతో రూ.6 వేల కోట్లతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్దరిస్తే… ప్రధానమంత్రి హాజరైన ఆ కార్యక్రమంలో పాల్గొనకుండా మొఖం చాటేసి సీఎం కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాల గురించి మాట్లాడటం హాస్యాస్పదం.

రైతు బంధు మినహా అన్ని సబ్సిడీలు బంద్ చేసి రైతుల నోట్లో మట్టి కొట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు. కేంద్రాన్ని బదనాం చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా జనం నమ్మే పరిస్థితిలో లేరనే వాస్తవాన్ని టీఆర్ఎస్ నేతలు గ్రహిస్తే మంచిదని హితవు పలికారు.

Leave A Reply

Your email address will not be published.