గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో చేర్యాల జడ్పిటిసి మృతి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో దారుణం చోటచేసుకుంది. చేర్యాల జెడ్పీటీసీ శెట్టి మల్లేశంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. గొడ్డళ్లు, కత్తులతో విచక్షణ రహితంగా దాడికి దిగారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన జెడ్పీటీసీ శెట్టి మల్లేశం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. వివరాలు.. జెడ్పీటీసీ శెట్టి మల్లేశం రోజూలానే సోమవారం ఉదయం గుర్జకుంట వద్ద వాకింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై గొడ్డళ్లు, కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో తలకు తీవ్రగాయాలు అవడంతో మల్లేశం అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. కుటుంబసభ్యులు ఆయనను హుటాహుటిన సిద్దిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబసభ్యులు మెరుగైన వైద్యం కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి నుంచి హైదరాబాద్ తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో మల్లేశం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.