రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రైతుల ఖాతాల్లో రైతుబంధు సాయాన్ని జమచేసి, అన్నదాతలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ఎంపీపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణికర్రావు, చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్తో కలిసి సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం దిగ్వాల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభించి, లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్లోని గేటెడ్ కమ్యూనిటీలా డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించినట్లు చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ఇలాంటి ఇండ్లను చూశారా అంటూ మంత్రి ప్రశ్నించారు. అప్పట్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రావాలంటే లంచాలు ఇవ్వాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని స్పష్టం చేశారు. త్వరలోనే స్థలాలున్న వారికి ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. రూ.5.60కోట్ల వ్యయంతో కోహిర్లో 88 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించినట్లు మంత్రి చెప్పారు.రూ.150కోట్లతో జహీరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. మాజీ మంత్రి గీతారెడ్డి హయాంలోనే తాగేందుకు నీళ్లు కూడా లేని పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతి ఆపరేషన్లలో సంగారెడ్డి జిల్లా టాప్లో నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యలో తెలంగాణలో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా తెలంగాణలో ఉన్నన్ని పతకాలు ఎక్కడా లేవని స్పష్టం చేశారు. కోహీర్లో రూ.50కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే డయాలసిస్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. త్వరలో సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను ప్రారంభించి గోదావరి జలాలను గోదావరికి తీసుకువస్తామని మంత్రి హామీ ఇచ్చారు. తెంగాణ భూముల రేట్లు పెరగడానికి కారణం ఇక్కడ జరుగుతున్న అభివృద్ధే కారణమని, అన్ని వర్గాల ప్రభుత్వం.. మన కేసీఆర్ ప్రభుత్వమని పేర్కొన్నారు.