నన్ను కూరలో కరివేపాకులా వాడుకుని వదిలేశారు

- మైనింగ్‌ కింగ్‌ గాలి సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్:  ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) పేరుతో ఆంధ్రప్రదేశ్ కర్ణాటక సరిహద్దుల్లో నిర్దేశించిన పరిమితికి మించి ఇనుప ఖనిజాన్ని తవ్వేసి వందల కోట్ల రూపాయలు ఆక్రమించినట్టు గాలి జనార్దన్రెడ్డిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికారులను బెదిరించడం లంచాలు ఇవ్వజూపడం పన్నులు ఎగ్గొట్టడం వంటి పలు కేసుల్లో గాలి జనార్దన్ రెడ్డి జైలుపాలు కూడా అయ్యారు. రెండేళ్లకు పైగానే జైలులో ఉన్నారు.గతంలో కర్ణాటకలోని బళ్లారి జిల్లాతోపాటు రాయచూరు తదితర జిల్లాలను కూడా తన కనుసైగతో శాసించారు.. గాలి జనార్దన్రెడ్డి ఆయన సోదరుడు గాలి సోమశేఖరరెడ్డి. ఆ తర్వాత ఓఎంసీ వ్యవహారంలో గాలి జనార్దన్ రెడ్డి నాటి బీజేపీ ప్రభుత్వంలో మంత్రి పదవిని కూడా పోగొట్టుకుని జైలుపాలయ్యారు.ఈ నేపథ్యంలో బీజేపీ తనను కూరలో కరివేపాకులా వాడుకుని వదిలేసిందని మైనింగ్ కింగ్ మాజీ మంత్రి గాలి జనార్దన్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోనూ కర్ణాటకలోనూ అధికారంలో ఉన్న బీజేపీ తనకు చేసిందేమీ లేదన్నారు. కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పేరుతో తాజాగా గాలి కొత్త పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి కృషి చేసినా తనకు ఎలాంటి గుర్తింపు హోదా ఇవ్వలేదని గాలి జనార్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కింద తాను నిజాయతీగానే మైనింగ్ చేశానని తెలిపారు. అప్పట్లో బళ్లారి నుంచి పోటీ చేసిన బీజేపీ నేత సుష్మా స్వరాజ్ కు తాను మద్దతిచ్చాననే తనను టార్గెట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రత్యర్థులు తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. తనపై ఉన్న కేసుల నుంచి తాను నిర్దోషిగా బయటపడతానని గాలి ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాపైన గాలి జనార్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.  2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బి. శ్రీరాములు తరపున ప్రచారం చేయాలని అమిత్ షా కోరారని తెలిపారు. నాటి ఎన్నికల్లో తనను చిత్రదుర్గ జిల్లాలోని మొలకాల్మూరు అసెంబ్లీ నియోజకవర్గానికే పరిమితం చేశారని ఆరోపించారు. మొలకాల్మూరులో శ్రీరాముల తరఫున ప్రచారం చేశానని వెల్లడించారు. తనను రాష్ట్రవ్యాప్తంగా చురుగ్గా ఉండేలా చేసి ఉంటే బీజేపీ 130 సీట్లకు పైగా గెలిచి ఉండేదన్నారు. శ్రీరాముల తరఫున ప్రచారం చేస్తే.. ఎన్నికలయ్యాక మంచి హోదా ఇస్తామని అమిత్ షా ఇచ్చారని చెప్పారు. తర్వాత తనను వాడుకుని వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు.గత శాసన సభ ఎన్నికల్లో బీజేపీకి 104 సీట్లు వచ్చాయని గాలి జనార్దన్ రెడ్డి గుర్తు చేశారు. గాలి జనార్దన్ రెడ్డిని బీజేపీ సరిగ్గా ఉపయోగించుకోలేదని అప్పట్లో మీడియాలో వార్తలు కూడా వచ్చాయన్నారు.ఆ తర్వాత బెంగళూరు వచ్చిన అమిత్ షా.. గాలి జనార్దన్ రెడ్డికి బీజేపీతో సంబంధం లేదన్నారని వాపోయారు. ఈ విషయాన్ని మీడియాలో చూసి తాను తన భార్య చాలా బాధపడ్డామని తెలిపారు.తాను బాగున్నప్పుడు అందరూ తన దగ్గరకు వచ్చారని.. తాను కష్టాల్లో ఉంటే పట్టించుకోలేదన్నారు. మాజీ ముఖ్యమంత్రులు యుడియూరప్ప జగదీష్ షెట్టార్ తప్ప ఎవరూ తనకు ధైర్యం చెప్పలేదన్నారు.యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్రకు వరుణలో టిక్కెట్ ఇచ్చి ఉంటే 2018 ఎన్నికల్లో బీజేపీకి ఇంకా ఎక్కువ సీట్లు వచ్చేవన్నారు. విజయేంద్రను కూడా బీజేపీ అధిష్టానం మోసం చేసిందని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు.కాగా తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకలో మంచి అనుచర గణం కలిగిన గాలి జనార్దన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఏకంగా కేంద్రంలో నెంబర్ టూగా ఉన్న అమిత్ షాపైనా హాట్ కామెంట్స్ చేయడంతో బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సి ఉంది.

 

Leave A Reply

Your email address will not be published.