పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో పది వేల మంది ఉగ్రవాదులు
- పాక్ హోంమంత్రి రాణా సనావుల్లా
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో పది వేల మంది ఉగ్రవాదులు కాసుకూర్చున్నారని పాక్ హోంమంత్రి రాణా సనావుల్లా తాజాగా వెల్లడించారు. ఇటీవల డాన్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘పాకిస్థాన్-ఆప్ఘనిస్థాన్ సరిహద్దులోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాష్ట్రంలో సుమారు 7 వేల నుంచి 10 వేల మంది వరకు తెహ్రీక్ ఎ తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాదులు కాసుకూర్చున్నారు. వారితోపాటు వారి కుటుంబ సభ్యులు మరో 25 వేల మంది అక్కడే ఉన్నారు. నవంబరు నుంచి టీటీపీ ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఉగ్రవాద వ్యతిరేక దళ విభాగం వైఫల్యమే ఇందుకు కారణం’ అని రాణా సనావుల్లా ఆరోపించారు. కాగా, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ పార్టీ ఆ రాష్ట్రంలో అధికారంలో ఉండడం గమనార్హం.పాక్-ఆప్ఘాన్ దేశాలు ఉగ్రవాదులకు పుట్టినిల్లు అని ప్రపంచం మొత్తం నమ్ముతోంది. ముఖ్యంగా ఉగ్రవాదులకు పాకిస్థాన్ స్వయంగా నిధులు సమకూరుస్తున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతేకాదు ఉగ్రవాదులకు పాక్ భూతల స్వర్గం అని కూడా ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి. దీంతో తాజాగా రాణా సనావుల్లా చేసిన వ్యాఖ్యలు ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉన్నాయి.