2022 లో రాష్ట్రము లో రూ. 34,117 కోట్ల మేర మద్యం విక్రయాలు
- విక్రయాల్లో రంగారెడ్డి, హైదరాబాద్ టాప్
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బ్యూరో చీఫ్: రాష్ట్రంలో ఆబ్కారీ ఆదాయానికి 2022 సంవత్సరం కొత్త కిక్కునిచ్చింది. జనవరి 1 నుంచి డిసెంబరు 30 వరకు ఏకంగా రూ. 34,117 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగాయి. 2021తో పోలిస్తే.. ఇది రూ. 7 వేల కోట్లు ఎక్కువ. నిజానికి 2020లో కరోనా కల్లోలం.. లాక్డౌన్లతో మద్యం విక్రయాలు మందగించాయి. 2021లో కొంత పుంజుకున్నా.. 2022లో మాత్రం మందుబాబులు ఆబ్కారీ ఆదాయానికి మంచి కిక్కునిచ్చారు. మద్యం విక్రయాల్లో రూ. 7,800 కోట్లతో రంగారెడ్డి జిల్లా ముందంజలో నిలిచింది. రూ. 3,638 కోట్లతో హైదరాబాద్ జిల్లా రెండో స్థానాన్ని ఆక్రమించింది. నల్లగొండ(రూ. 3,447 కోట్లు), వరంగల్ అర్బన్(రూ.3,395 కోట్లు), కరీంనగర్(రూ. 2,893కోట్లు), మెదక్(రూ. 2,841 కోట్లు), మహబూబ్నగర్(రూ. 2,415కోట్లు), ఖమ్మం(రూ. 2,145 కోట్లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.ఆబ్కారీ శాఖ గణాంకాల మేరకు 2022 ఏప్రిల్-నవంబరు నెలల మధ్యలోనే రూ. 25,147 కోట్ల మేర లిక్కర్ సేల్స్ జరిగాయి. ఈ మధ్యకాలంలో బీర్ అత్యధికంగా అమ్ముడైంది. మందుబాబులు 3.48 కోట్ల కేసుల(కార్టన్ల) మేర బీర్ను కొనుగోలు చేశారు. మిగతా లిక్కర్ సేల్స్ 2.52 కేసుల మేర జరిగాయి.
రెండు సార్లు ధరలు పెంచినా..
తెలంగాణ ఆవిర్భావం నుంచి సర్కారు రెండు సార్లు మద్యం ధరలను పెంచింది. దానికి తోడు కొత్త లిక్కర్ పాలసీతో షాపుల సంఖ్యను పెంచింది. 2021లో కేవలం లిక్కర్ షాపుల దరఖాస్తుల ద్వారానే ఆబ్కారీ శాఖకు రూ. 1,200 కోట్ల మేర ఆదాయం వచ్చింది. 2014-15తో పోలిస్తే.. మద్యం విక్రయాలు ఏయేటికాయేడు పెరుగుతున్నాయి. 2014-15లో మద్యంపై రూ. 10,888 కోట్ల మేర ఆదాయం రాగా, ఐదేళ్లలో.. అంటే.. 2018-19కి అది రెట్టింపు (రూ. 20,850 కోట్లు) అయ్యింది.