మళ్లీ క్యాన్సర్ బారిన పడిన టెన్నిస్ లెజెండ్ మార్టినా నవ్రతిలోవా
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: టెన్నిస్ స్టార్ మార్టినా నవ్రతిలోవా గొంతు, బ్రెస్ట్ కేన్సర్ బారినపడ్డారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని.. క్యాన్సర్తో పోరాడుతున్నానని టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా సోమవారం ప్రకటించారు. గొంతు పరీక్ష చేయించుకోగా గొంతు, బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణ అయిందని తెలిపారు. 18 గ్రాండ్స్లామ్ సింగిల్స్ చాంపియన్షిప్ టైటిళ్లను గెలుచుకున్న మార్టినా నవ్రతిలోవా న్యూయార్క్లో చికిత్స పొందనున్నారు. ఈ మేరకు టెన్నిస్ స్టార్ ప్రకటన విడుదల చేశారు. ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ సభ్యురాలు మార్టినా నవ్రతిలోవా ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ఈ నెలలో క్యాన్సర్ చికిత్స తీసుకుంటారని తెలిపారు. అయితే, ఇవి ప్రారంభ దశలోనే ఉన్నాయని, పూర్తిగా కోలుకుంటానని ఆశిస్తున్నానని 66 ఏళ్ల మార్టినా ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు కేన్సర్లు తీవ్రమైనవే అయినా వాటితో పోరాడుతానని.. చికిత్స అనంతరం కోరుకున్న ఫలితం వస్తుందని ఆశిస్తున్నట్టు వెల్లడించారు. నోటినుంచి దుర్వాసన వస్తుండటంతో పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపారు. నవంబర్లో టెక్సాస్లోని ఫోర్ట్ వర్త్లో జరిగిన సీజన్-ఎండింగ్ డబ్ల్యుటిఎ ఫైనల్స్కు హాజరైనప్పుడు ఆమె గొంతులో శోషరస కణుపు విస్తరించినట్లు గమనించానని, బయాప్సీలో గొంతు క్యాన్సర్ ప్రారంభ దశలో ఉన్నట్లు తేలిందన్నారు. ఇదేసమయంలో రొమ్ములో కూడా క్యాన్సర్ కారకం బయటపడిందన్నారు.