బండి సంజయ్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై పోలీస్ కేసు నమోదు అయింది. కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త ఘటనలకు కారణమైనందుకు బండి సంజయ్‌తో పాటు మరో నలుగురిపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ప్రజా ఆస్తి చట్టం 147,148,353,323,290,341,427,149 సెక్షన్లతో సహా 11 సెక్షన్ల కింద కామారెడ్డి దేవరపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు అయ్యాయి.

బండి సంజయ్‌తో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి, ఇతర బీజేపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం సాయంత్రం కామారెడ్డి కలెక్టరేట్‌ను బండి సంజయ్‌తో పాటు బీజేపీ నేతలు ముట్టిడించారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. బీజేపీ కార్యకర్తలు గేటు దూకి కలెక్టరేట్ లోపలికి దూసుకెళ్లారు. దీంతో కలెక్టర్ గేటు ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టెన్షన్ వాతావరణం నేపథ్యంలో బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.

బండి సంజయ్ అరెస్ట్‌ను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు.. పోలీస్ వాహనం ముందుకెళ్లకుండా కాసేపు అడ్డుపడ్డారు. బీజేపీ కార్యక్తలు పోలీస్ వాహనం అద్దాలు పగులగొట్టారు. ఉద్రిక్త పరిస్థితులకు కారణం కావడం, పోలీస్ వాహనంను ధ్వంసం చేసిన క్రమంలో బండి సంజయ్‌తో పాటు బీజేపీ నేతలపై పోలీసులు నాన్ బెయిల‌బుల్ కేసులు నమోదు చేసినట్లు కామారెడ్డి పోలీసులు స్పష్టం చేశారు. మాస్టర్ ప్లాన్‌ను వ్యతిరేకిస్తున్న రైతులతో కలిసి కలెక్టరేట్‌ వద్ద బండి సంజయ్ ధర్నాకు దిగారు. ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో బండి సంజయ్‌ను అరెస్ట్ చేసి రాత్రి హైదరాబాద్‌కు పోలీసులు తరలించారు. కామారెడ్డి కలెక్టరేట్ వద్ద రైతుల ఆందోళనలు నేడు కూడా కొనసాగుతున్నాయి.

మాస్టర్ ప్లాన్‌పై రామేశ్వర్ పల్లి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 9న రైతుల పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఇవాళ కామారెడ్డిలో రేవంత్ టీమ్ పర్యటింనుంది. రైతుల ఆందోళనలో పాల్గొననుంది. రేవంత్ టీమ్ పర్యటనల్ నేపథ్యంలో కామారెడ్డి కలెక్టరేట్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. తమ భూములు మాస్టర్ ప్లాన్‌లో తీసుకోవద్దని, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మాస్టర్ ప్లాన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ఆందోళనలు విరమించేది లేదని తేల్చిచెబుతున్నారు. మాస్టర్ ప్లాన్‌లో భూమి కోల్పోయినందుకు ఆత్మహత్య చేసుకున్న రైతు పయ్యావుల రాములు కుటుంబానికి న్యాయం చేయాలని , ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తోన్నారు. రాములు కుటుంబాన్ని ఇప్పటికే బండి సంజయ్‌ పరామర్శించారు. నిన్న రైతులపై పోలీసుల దాడిని ఖండిస్తూ ఇవాళ కలెక్టరేట్ ముందు రైతులు ఆందోళనకు దిగారు.

Leave A Reply

Your email address will not be published.