మునుగోడులో నోట్ల కట్టల కలకలం
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్:
మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో ఆ నియోజ కవర్గంలో ఒక్కసారిగా నోట్ల కట్టలు కలకలం రేపాయి. నేటి నుంచి మునుగోడు ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా, ప్రచారం సైతం ఊపందుకుంది. ఇదే సమయంలో ఓ కారులో తరలిస్తున్న రూ.13 లక్షలు పట్టుబడటం స్థానికంగా సంచలనం సృష్టించింది. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం గూడపూరు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో మర్రిగూడ మండలం భీమనపల్లికి చెందిన నరసింహ తన కారులో రూ.13 లక్షలు తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ డబ్బు హైదరాబాద్లో ప్లాట్ అమ్మగా వచ్చిందని, పండగకు సొంత ఇంటికి వస్తూ తీసుకువచ్చానని.. మళ్లీ ఆ డబ్బును హైదరాబాద్కు తీసుకువెళ్తున్నానని కారు యజమాని చెప్పాడు. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో నగదు విషయంలో ఆంక్షలు అమలు అవుతున్న సంగతి తెలిసిందే. ఇదిలావుంటే.. పట్టుబడిన నగదు నిజంగా ప్లాట్ అమ్మితే వచ్చిందా..? లేక ఎన్నికల ఖర్చులకోసం ఎవరైనా పంపిణీ చేస్తున్నారా..? అన్న విషయం తేలాల్సి ఉంది.