ఛార్జ్ తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కొత్త ఇంచార్జ్ మాణిక్ రావు ధాక్రే

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కొత్త ఇంచార్జ్ మాణిక్ రావు ధాక్రే చార్జ్ తీసుకున్నారు. ఆయన తెలంగాణ పార్టీని గాడిన పెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. గాంధీ భవన్‌లో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.  ఇన్‌చార్జి హోదాలో తొలిసారి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి  , మల్లు భట్టి విక్రమార్క, వీహెచ్, పలువురు కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. అక్కడ నుంచి నేరుగా గాంధీభవన్‌ కు చేరుకుని ముఖ్యనేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.  రేవంత్‌‌రెడ్డి, భట్టి విక్రమార్క, మధుయాష్కీ, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్‌‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబులతో వేర్వేరుగా థాక్రే భేటీ అయి కీలక అంశాలపై చర్చలు జరపనున్నారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీని కూడా నిర్వహిస్తారు.

గురువారం కూడా ఆయన హైదరాబాద్‌లోనే ఉంటారు.   డీసీసీలు, ఆఫీస్ బేరర్లు, అనుబంధ సంఘాల చైర్మన్‌లు, అధికార ప్రతినిధులతో మాణిక్‌రావు థాక్రే చర్చించనున్నారు. మరోవైపు ఈనెల 26 నుంచి హాత్‌ సే హాత్‌ జోడో యాత్రలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రేవంత్‌రెడ్డి పాదయాత్రపైనా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశమూ ఉంది.   కొత్త ఇంచార్జ్ రాకపై సీనియర్ నేతల స్పందన ఎలా ఉంటుందోనని టీ కాంగ్రెస్ వ్యవహారాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకూ ఏ నేత ఇంచార్జ్ గా వచ్చినా అసమ్మతి గ్రూపు వారికి చుక్కలు చూపిస్తూ వస్తోంది. అప్పట్లో కుంతియా..ఆ తర్వాత వచ్చిన మాణిగం ఠాగూర్ కూడా అసంతృప్తి నేతలను తట్టుకోలేకపోయారు.

హైకమాండ్ ను బతిమాలి తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతల నుంచి వైదొలిగారు. ఇప్పుడు మహారాష్ట్ర నేత వస్తున్నారు. అయితే ఆయన ఇతర నేతల్లా సాఫ్ట్ కాదని.. చాలా హార్డ్ గా డీల్ చేస్తారన్న అభిప్రాయం వినిపిస్తోంది. దీంతో సీనియర్ నేతలు ఆయనతో ఎలా ఉంటారన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఇంచార్జ్ ను మార్పించడంలో సక్సెస్ అయ్యామనుకుంటున్న తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేతలు.. ఎలాగైనా పీసీసీ చీఫ్ ను కూడా మార్పించాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీని కోసం వారు హైకమాండ్ పై మరింత  ఒత్తిడి వ్యూహం అమలు చేయనున్నట్లుగా చెబుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.