ఆవును ఢీకొట్టిన వందేభారత్ ఎక్స్ప్రెస్
ప్రధాని నరేంద్రమోదీ గత నెల ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు.. రెండు రోజుల నుంచి వార్తల్లో నిలుస్తున్నది. గురువారం బర్రెల మందను ఢీకొట్టగా, నేడు ఆవును ఢీకొట్టింది. ఇవాళ సాయంత్రం 3:44 నిమిషాలకు గాంధీనగర్-ముంబై మార్గంలో అవును ఢీకొట్టడంతో రైలు ముందు భాగానికి సొట్టపడింది. ఘటన కారణంగా 10 నిమిషాలు ఆగిపోయి తిరిగి బయలుదేరింది.
గురువారం కూడా కొత్తగా ప్రారంభమైన సెమీ హైస్పీడ్ రైలు నాలుగు బర్రెలతో కూడిన మందను ఢీకొట్టింది. రైలు ముంబై నుంచి గాంధీనగర్కు వెళ్తుండగా ఉదయం 11 గంటల సమయంలో అహ్మదాబాద్ సమీపంలో బెట్వా-మనీనగర్ స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో రైలు ముందు భాగం పగిలిపోయింది. ఈ రెండు ఘటనలు రైలు మెటీరియల్లో నాణ్యతపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. బర్రెలు, ఆవులను ఢీకొన్నా రైలు ముఖ భాగం దెబ్బతినడంతో.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన రైలు ఇంత బలహీనమా అనే విమర్శలు వస్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం రైలు నాణ్యతపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని చెబుతున్నది. డ్యామేజీ అయినా తిరిగి కొత్త భాగాన్ని అమర్చేలా రైలు ముందు భాగాన్ని ఫైబర్తో డిజైన్ చేశారని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.