తాను మధ్యతరగతి కుటుంబనుంచే వచ్చా
- వారి కష్టాలు తనకు బాగా తెలుసు.. నిర్మలా సీతారామన్
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మధ్యతరగతి కుటుంబ నేపథ్యం నుంచే తాను వచ్చానని, వారి కష్టాలు తనకు బాగా తెలుసునని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇంతవరకూ ఏ బడ్జెట్లోనూ మధ్యతరగతి వారిపై ఎలాంటి కొత్త పన్నులు విధించలేదని గుర్తుచేశారు. 5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న ప్రజలపై ఎలాంటి పన్నులు విధించలేదన్నారు. రాబోయే బడ్జెట్లోనూ మధ్యతరగతి కోసం మోదీ ప్రభుత్వం మరింత చేయబోతోందని చెప్పారు. మరో మూడు వారాల లోపే కేంద్ర బడ్జెట్ ప్రకటించనున్న తరుణంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.“మధ్యతరగతి వారు ప్రజారవాణా సంస్థలపై ఎక్కువగా ఆధారపడుతుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని 27 ప్రాంతాల్లో మెట్రో తీసుకువచ్చాం. అలాగే ఎక్కువ మంది మధ్యతరగతి వారు ఉద్యోగాలు వెతుక్కునేందుకు ఒక సిటీ నుంచి మరో సీటీకి షిఫ్ట్ అవుతుంటారు. ఆ కారణంగా స్మార్ట్ సిటీల లక్ష్యంపై దృష్టి సారించాం. మధ్యతరగతి వారి కోసం మేము చేస్తున్న కృషి కొనసాగుతుంది” అని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనుండటం, 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇదే ఎన్డీయే సర్కార్ చివరి బడ్జెట్ కావడంతో పన్నుల ఉపశమనం, హెల్త్ కేర్, ఉద్యోగాలపై ఈ బడ్జెట్లో కేంద్రం ప్రత్యేక దృష్టి సారించవచ్చనే అంచనాలు ఉన్నాయి.