వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు

- గంగిరెడ్డికి మంజూరైన బెయిల్ రద్దు విచారణను తెలంగాణ హైకోర్టుకు బదిలీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మాజీ మంత్రి మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు గంగిరెడ్డి బెయిల్ రద్దు వ్యవహారంపై తీర్పు ఇచ్చింది. గంగిరెడ్డికి మంజూరైన బెయిల్ రద్దు అంశంపై విచారణను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది.ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ హైకోర్టులో మరోసారి విచారణ జరపాలని సుప్రీంకోర్టు  సూచించింది. ఇటీవల వివేకా మర్డర్ కేసు విచారణనున తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బెయిల్ రద్దు అంశాన్ని కూడా తెలంగాణ హైకోర్టులో తేల్చాలని దేశ అత్యున్నత స్థానం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.నిందితుడు నాన్ బెయిలబుల్ నేరానికి పాల్పడినప్పుడు చార్జిషీటు దాఖలు కాలేదన్న కారణంతో కేసులోని మెరిట్స్ను పరిగణలోకి తీసుకోకుండా డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయడం తగదని సుప్రీంకోర్టు తెలిపింది.
కేసులోని మెరిట్స్ ఆధారంగా బెయిల్ అంశంపై మరోసారి విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టుకు సూచించింది. డిఫాల్డ్ బెయిల్ రద్దు కాదంటూ ఏపీ హైకోర్టు తీర్పునివ్వడాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పుబట్టింది. డిఫాల్ట్ బెయిల్ పొందిన వ్యక్తి విచారణకు సహకరించని పక్షంలో బెయిల్ రద్దు చేసే అవకాశం ఉంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.సార్వత్రిక ఎన్నికల ముందు 2019 మార్చి 19న వివేకాను దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో ఎర్రగంగిరెడ్డి కీలక నిందితుడు అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం గంగిరెడ్డి బెయిల్పై ఉన్నాడు. పులివెందులలోనే నిర్భయంగా తిరుగుతున్నాడు.ఈ నేపథ్యంలో ఎర్ర గంగిరెడ్డికి కింది కోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ సీబీఐ అధికారులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ హైకోర్టు కూడా కింది కోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సమర్థించింది.
ఈ నేపథ్యంలో  సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును పలుమార్లు విచారించిన సుప్రీంకోర్టు తాజాగా బెయిల్ వ్యవహారాన్ని కూడా తెలంగాణ హైకోర్టుకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Leave A Reply

Your email address will not be published.