తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘనలు
- తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర వ్యాఖ్యలు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కేసీఆర్ ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘనలు, కేసీఆర్ ప్రభుత్వంపై కేంద్రానికి నివేదిక ఇచ్చానని గవర్నర్ చెప్పారు. 5 లక్షల మందితో కేసీఆర్ బహిరంగ సభ పెట్టారని, ఖమ్మం సభకు లేని కరోనా రిపబ్లిక్ డేకు గుర్తు వచ్చిందా? అని పుదుచ్చేరి గణతంత్ర వేడుకల్లో గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండేళ్ల నుంచి రాజ్భవనంపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని.. ప్రభుత్వం రాజ్యాంగ విలువలు పాటించడంలేదని తమిళిసై ఆరోపించారు.అభివృద్ధి అంటే భవనాల నిర్మాణాలు కాదని, జాతి నిర్మాణం అని తమిళిపై అన్నారు. ఫామ్హౌస్లు కట్టడం కాదని, అందరికి ఫార్మ్లు కావాలని, రైతులు, పేదలు అందరికీ భూములు, ఇళ్లు కావాలని గవర్నర్ తెలిపారు. మన పిల్లలు విదేశాల్లో చదవడం అభివృద్ధి కాదని.. రాష్ట్ర విద్యాలయాల్లో అంతర్జాతీయ సౌకర్యాలు ఉండాలని తమిళిసై స్పష్టం చేశారు. రాజ్యాంగస్ఫూర్తికి అనుగుణంగా ప్రజాప్రతినిధులు నడుచుకోవాలని ఆమె సూచించారు. తెలంగాణ ప్రజలు ఆత్మస్థైర్యంతో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నానని గవర్నర్ అన్నారు. తెలంగాణ గౌరవాన్ని నిలబెడదాం.. రాజ్యాంగాన్ని కాపాడుదామని.. కొంతమందికి తాను నచ్చకపోవచ్చని.. కానీ తెలంగాణ ప్రజలంటే తనకు ఇష్టమని గవర్నర్ తమిళిసై చెప్పారు. తెలంగాణ అభివృద్ధిలో తన పాత్ర తప్పక ఉంటుందని గవర్నర్ అన్నారు.