భక్తుల సౌకర్యార్ధం అందుబాటులోకి టీటీడీ కొత్తయాప్‌

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భక్తుల సౌకర్యార్ధం టీటీడీ కొత్తయాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇదివరకు ఉన్న గోవింద యాప్‌ను అప్‌డేట్‌ చేస్తూ టీటీ దేవస్థానమ్‌ యాప్‌ను అప్‌గ్రేడ్‌ చేసింది. జియో సహకారంతో రూపొందించిన ఈ యాప్‌ను టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ యాప్‌ ద్వారా దర్శన టికెట్లు, వసతి గదులు, సేవలు ఇలా అన్ని రకాల బుకింగ్స్ , టీటీడీ చరిత్ర తదితర అంశాలన్నింటిని యాప్‌లో అందుబాటులో ఉంచామని వారు వెల్లడించారు.తిరుమల శ్రీవారికి విరాళాలు కూడా అందజేయవచ్చని వారు వివరించారు. గతంలో టీటీడీకి గోవింద యాప్‌ ఉండగా సాంకేతిక సమస్యలు వస్తుండడంతో వాటి స్థానంలో కొత్త యాప్‌ను తీసుకొచ్చారు. ఇటీవల ప్రయోగాత్మకంగా జియో క్లౌడ్ టెక్నాలజీ ద్వారా ఆన్‌లైన్ టికెట్లు జారీ ప్రక్రియ సులభం కావడంతో నూతన యాప్‌ను తీసుకొచ్చామని పేర్కొన్నారు. మొన్నటి వరకు దర్శన టికెట్లను కేవలం ఆన్‌లైన్‌ వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకునేవారు.ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన యాప్‌ ద్వారా భక్తులు సులభంగా దర్శనం, గదులు, శ్రీవారిసేవా టికెట్లను బుక్ చేసుకోవచ్చని వారు తెలిపారు. సేవలు జరిగే సమయంలో సుప్రభాతం, తోమాల, అర్చన వంటి వాటిని వినేందుకు వీలుగా యాప్ తయారు చేసినట్లు వివరించారు. ఇప్పటికే గోవింద యాప్‌ను కలిగి ఉన్న వారు గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి టీటీ దేవస్థానమ్స్‌ ను అప్‌డేట్ చేసుకోవాలని సూచించారు. కొత్తయాప్‌ ద్వారా ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారాలు వీక్షించవచ్చని వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.