ఫిబ్రవరి 1 తర్వాత బంగారం ధరలు భారీగా తగ్గనున్నాయా? కీలక నిర్ణయం దిశగా మోడీ సర్కార్
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్ను పార్లమెంట్లో మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్పై ఎన్నో ఆశలు నెలకొని ఉన్నాయి. కేంద్రానికి ఇదే చివరి బడ్జెట్ కావడంతో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయన్న ఆసక్తి నెలకొంది. ఈసారి బడ్జెట్లో కొన్ని వస్తువులు ఖరీదైనవి, మరికొన్ని చౌకగా మారనున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2023న బడ్జెట్ను సమర్పించిన తర్వాత పూర్తి వివరాలు తెలియనున్నప్పటికీ, వివిధ మంత్రిత్వ శాఖలు తమ సిఫార్సులను పంపాయి. స్థానిక ఉత్పత్తి పెంపుపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సమర్పించే బడ్జెట్లో, ప్రభుత్వం మొత్తం దృష్టి దేశంలో ఉత్పత్తిని పెంచడం, అనవసరమైన వస్తువుల దిగుమతిని తగ్గించడంపైనే ఉంటుంది. తద్వారా దేశంలోని వాణిజ్య నిల్వలను సరిచేయవచ్చు. కరెంట్ ఖాతా లోటును తగ్గించవచ్చు.
అందుకే వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వివిధ ఉత్పత్తుల జాబితాను కోరింది. దీని దిగుమతి అవసరం లేదు. దేశీయ ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం అనేక రంగాలకు పీఎల్ఐ పథకాన్ని ప్రారంభించింది. ఇక బంగారం చౌకగా ఉండే అవకాశం ఉందని, తద్వారా ఆభరణాల ఎగుమతులు పెరుగుతాయని తెలుస్తోంది. రత్నాలు, ఆభరణాల రంగానికి సంబంధించి బంగారంతో పాటు మరికొన్ని వస్తువులపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సూచించింది.
తద్వారా దేశం నుండి ఆభరణాలు, ఇతర ఉత్పత్తుల ఎగుమతులు పెరుగుతాయి. గతేడాది బడ్జెట్లో బంగారంపై దిగుమతి సుంకాన్ని 10.75 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం పెంచింది. ఒక వేళ ఈ బడ్జెట్లో ప్రభుత్వం సుంకాన్ని తగ్గించినట్లయితే బంగారం, అభరణాలు, ఇతర రత్నాల ధరలు తగ్గే అవకాశాలు ఉంటాయి. దీంతో బంగారం కొనుగోలు చేసేవారికి ఇది శుభవార్తేనని చెప్పవచ్చు.