పేదల పొట్టకొడుతున్న మోదీ ప్రభుత్వం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దేశంలోని కోట్లాది ప్రజలకు ఉపాధి కల్పించడమే కాక గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పట్ల నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తూ పేద ప్రజల పొట్టకొట్టడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం వస్తుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్న క్రమంలో బహుళజాతి సంస్థలైన అమెజాన్, గూగుల్ వంటి సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్న పరిస్థితిని మనం ఈ రోజు చూస్తున్నాం. ఇటువంటి క్లిష్టమైన సమయాల్లో దేశ ఆర్థిక వ్యవస్థని బలంగా ఉంచేది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మాత్రమే. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే ఉపాధి హామీ పథకాన్ని విస్మరిస్తే అది దేశానికే ప్రమాదమన్న విషయాన్ని కేంద్రం గమనంలో ఉంచుకోవడం మంచిదని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.