కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తోంది

- రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులను క్యాపిటల్ ఇన్వెస్ట్ మెంట్ పై వెచ్చిస్తూ ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తోందని, ఈ విషయంలో దేశంలోని ఇతర రాష్ట్రాలకు, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.

రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే సందర్భంలో పార్లమెంట్ సమావేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ, ఆర్థిక క్రమశిక్షణపై కొన్ని రాష్ట్రాలు గాడి తప్పి వ్యవహరిస్తున్నాయని, ఉచితాల ప్రకటనలు చేస్తున్నాయని, ఇది ప్రమాదకరమని, పక్క దేశాల ఆర్థిక దుస్థితిని గమనించాలని చేసిన వ్యాఖ్యలపై వినోద్ కుమార్ స్పందించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తోందని, చేసిన.. చేస్తున్న అప్పులను భవిష్యత్ తరాల కోసం ఆస్తులుగా తయారు చేస్తోందని వినోద్ కుమార్ స్పష్టం చేశారు.

అప్పులను కేవలం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పై వెచ్చిస్తోందని, ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ రానున్న రోజుల్లో పదింతలు రెట్టింపు విలువను చేయనుందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అప్పులను తీసుకొచ్చి కాలేశ్వరం ప్రాజెక్టును, పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని, యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్రాజెక్టుల కోసం మాత్రమే వెచ్చించిందని, తద్వారా అద్భుతమైన ఫలితాలు రాష్ట్రంలో సాధ్యమవుతున్నాయని వినోద్ కుమార్ తెలిపారు.

కాలేజ్ కాలేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలతో పంటలు పుష్కలంగా పండుతున్నాయని, వరి ధాన్యం పండించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రభాగాన నిలిచిందని, రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను ఉచితంగా సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని వినోద్ కుమార్ వివరించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు, ఎత్తిపోతల పథకాలతో రాష్ట్రంలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయని, భూగర్భంలో దాదాపు 600 టీఎంసీల నీళ్లు భద్రపడి ఉన్నాయని వినోద్ కుమార్ తెలిపారు.

ఉదాహరణకు కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం వినియోగించిన స్టీల్ ధర అప్పటికన్నా ప్రస్తుతం మార్కెట్లో విపరీతంగా పెరిగిందని, ఇది భవిష్యత్ తరాల కోసం సంపద సృష్టించినట్లు కాదా..?? అని వినోద్ కుమార్ ప్రధాని నరేంద్ర మోడీనీ ప్రశ్నించారు.

అప్పులు భవిష్యత్ తరాల బంగారు భవిత కోసమే అని, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే అని, అయితే అప్పు చేసిన డబ్బును జీతాలు, పెన్షన్స్, రోడ్లు, ఇతర పనులకు ఖర్చు చేయడం లేదని, ఈ విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గమనించాలని వినోద్ కుమార్ సూచించారు.

Leave A Reply

Your email address will not be published.