కాపులు ఎటు ఉంటే అటు అధికారం

- కాపులను వాడుకునే ప్రయత్నం ప్రతిసారి జరుగుతోంది - బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఏపీ లో 22 శాతం ఉన్న కాపులు ఎటు ఉంటే అటు అధికారం రావటం 1989 నుంచి చూస్తున్నామని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… ఎన్నికల సమయంలోనే ఓట్లు అవసరం కాబట్టి కాపులను వాడుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యధిక శాతం ఉన్న కాపులను వాడుకునే ప్రయత్నం ప్రతిసారి జరుగుతోందన్నారు. కాపులకు రిజర్వేషన్ల డిమాండ్ సుదీర్ఘ కాలం నుంచి ఉందని… చాలా మంది నాయకులు రిజర్వేషన్‌ల కోసం పోరాటాలు చేశారని గుర్తుచేశారు. కాపులకు రిజర్వేషన్‌లు ఇవ్వాలని తాను కూడా కోరుకుంటున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ (తొమ్మిదేళ్ల క్రితం పార్టీ పెట్టారని… జనసేన పార్టీ ని బయట నుంచి ఎవ్వరూ ప్రభావితం చేయకుండా చూడాలని కోరారు. జనసేనను అధికారంలోకి తీసుకురావటంపై పవన్ కల్యాణ్  నిర్ణయానికి వదిలేస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. జీవీఎల్ ఏం సాధించారని కాపులతో సన్మానాలు చేస్తున్నారో అర్థం కావటం లేదనిజీవీఎల్ పార్లమెంట్‌ లో అడిగిన సమాచారం గూగుల్‌లో కొట్టినా వస్తుందని ఆయన ఎద్దేవా చేశారు.కేంద్ర ప్రభుత్వం ఓబీసీ రిజర్వేషన్లకు చట్ట సవరణ చేసి రాష్ట్రాలకు అధికారం ఇచ్చిందన్నారు. దాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్రంలో ఓబీసీ కోటా లో కాపులకు రిజర్వేషన్లు ఇప్పిస్తే బాగుంటుందని తెలిపారు. 1994లో కాపుల స్కాలర్ షిప్‌లకు సంబంధించి కోట్ల విజయభాస్కర రెడ్డి జీవో ఇచ్చారని గుర్తు చేశారు. అయితే ఆయన బీసీ సంక్షేమ శాఖ తరపున జీవో ఇవ్వటంతో అమలు కాలేదన్నారు. వైఎస్ఆర్ సీఎంగా ఉండగా కాపు రిజర్వేషన్ అంశం తెరపైకి వచ్చిందని తెలిపారు. కాపుల సామాజిక ఆర్థిక సర్వే కోసం వైఎస్ చర్యలు చేపట్టారన్నారు. చంద్రబాబు హయాంలో ఈబీసీ కోటాలో కాపులకు రిజర్వేషన్లు వచ్చేలా నిర్ణయం తీసుకున్నారన్నారు. కాపులకు రిజర్వేషన్ల అంశాన్ని చంద్రబాబు పూర్తి చేశారని చెప్పుకొచ్చారు. కాపుల సంక్షేమం కోసం సిన్సియర్ గా పని చేసింది పి.శివ శంకర్మిరియాల వెంకట్రావు చిత్తశుద్ధితో పని చేశారని తెలిపారు. కాపులకు రాజకీయ దిశ నిర్దేశించే శక్తి తనలో లేదని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.