కాంగ్రెస్, బీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీలు అన్నీ దండుపాళ్యం బ్యాచ్..
- బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్లో లేదని.. అధికారంలోకి రాలేమనీ కాంగ్రెస్ నేతలు అంటున్నారన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఆ పార్టీలో గెలిచిన వారు బీఆర్ఎస్ లోకి వెళ్ళారన్నారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే గెలిచిన తర్వాత బీఆర్ఎస్కు వెళ్తారని ప్రజలు అనుకుంటున్నారన్నారు.బీజేపీ అధికారంలోకి రాదంటే.. మరి సీఎం కేసీఆర్ బీజేపీ ని ఎందుకు తిడుతున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీలు అన్నీ కలిసి పోటీ చేస్తాయని అన్నారు. వాళ్ళందరూ దండుపాళ్యం బ్యాచ్.. అంటూ ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్కు వయసు పెరిగింది… అందుకే ఇంకా ఈటల రాజేందర్ వాళ్ళ పార్టీలో ఉన్నారని అనుకుంటున్నారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ ఢిల్లీ లో మీడియాతో మాట్లాడుతూ ఈసారి తెలంగాణ లో హంగ్ అసెంబ్లీ వస్తుందని జోస్యం చెప్పారు. తమతో కలవాల్సిందే కాబట్టి సీఎం కేసీఆర్ కాంగ్రెస్ను పొగుడుతూ.. బీజేపీ ని తిడుతున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఒంటరిగా అధికారంలోకి రాదని, మరో పార్టీతో కలవాల్సిందేనని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఏం చేసిందో మేము చెప్పామని, దేశానికి చాలా చేసిందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ మంచి పార్టీ అని, తెలంగాణ ఇచ్చిందని.. మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎందుకు కొన్నారని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ సెక్యులర్ పార్టీలని, తాము బీజేపీతో కలిసేదిలేదని స్పష్టం చేశారు. సీనియర్ నేతలు అందరూ కలిస్తే కాంగ్రెస్కు 40 నుంచి 50 సీట్లు వస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.