గజిని పార్ట్ 2 కి రెడీ అవుతున్న హీరో సూర్య

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: తమిళ స్టార్ హీరో సూర్య క్రేజీ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్ మళ్లీ సెట్ కాబోతుంది. దాదాపు మళ్లీ 11 ఏళ్ల తరువాత ఈ క్రేజీ కాంబోలో సినిమా వస్తున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన గజిని సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వగా సెవెన్త్ సెన్స్ మూవీ యావరేజ్‌గా నిలిచింది. ఇప్పుడు గజిని మూవీ సీక్వెల్ తీసేందుకు మురుగదాస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం కథ చర్చలు జరుగుతున్నాయని.. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉనట్లు వార్తలు వస్తున్నాయి. 2005లో విడుదలైన గజిని మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్‌ హిట్‌గా నిలిచింది. అప్పట్లో ఈ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్‌గా మారింది. ఎవరైనా ఏదైనా కాస్త మర్చిపోతే.. ఏంటి గజినిలా తయారవ్వంటూ ఇప్పటికీ ఈ సినిమా పేరును వాడేస్తుంటారు. ఈ చిత్రంలోని సూర్య-ఆసిన్ మధ్య లవ్ ట్రాక్ ఆడియన్స్‌కు తెగ నచ్చేసింది. ఆ తరువాత బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ఈ సినిమాను ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్‌లోనే హిందీలో రిమేక్ చేశారు. అక్కడ కూడా ఈ మూవీ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. 2008లో రిలీజ్ అయిన ‘గజిని’.. వంద కోట్ల మార్క్ చేరుకున్న తొలి బాలీవుడ్ మూవీగా నిలిచింది. గజినిలో మూవీలో సూర్య సరసన ఆసిన్ నటించింది. నయనతార కాలేజీ స్టూడెంట్‌గా యాక్ట్ చేసింది. మరి గజిని-2లో నయనతార నటిస్తుందో లేదో చూడాలి. చాలా రోజుల తరువాత మురుగదాస్ మళ్లీ ఓ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడని తెలిసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆయన చివరగా సూపర్ స్టార్ రజనీకాంత్‌తో దర్బర్ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఈ సినిమా తరువాత మురుగదాస్ నుంచి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. ఇంత టాలెంటెడ్ డైరెక్టర్ ఎందుకు సినిమాలు తీయట్లేదని అభిమానులు బాధపడ్డారు. ఇప్పుడు గజిని-2కు సంబంధించి వార్తలు వస్తుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.