దేశం ఏదైనా కష్టాల్లో ఉంటే మానవత్వంతో సాయం చేయడమే భారత విధానం

- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రపంచమంతా ఒకటే కుటుంబమని, ఎవరికి ఏ సమస్య వచ్చినా తక్షణమే స్పందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇతరులకు సాయం చేసేవారు నిస్వార్ధులని, ఇది వ్యక్తులకే కాకుండా దేశాలకు కూడా వర్తిస్తుందని చెప్పారు. అనేక సంవత్సరాలుగా భారత్ నిస్వార్ధంగా సాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకుందని చెప్పారు. దేశం ఏదైనా కష్టాల్లో ఉంటే మానవత్వంతో సాయం చేయడమే భారత విధానమన్నారు. తుర్కియేసిరియాల్లో భూకంప బాధితులకు సేవలు అందించి వచ్చిన భారత సహాయక బృందాలతో ప్రధాని ఢిల్లీలోని తన నివాసంలో సమావేశమయ్యారు. రెండు దేశాల్లో వారు 10 రోజుల పాటు అందించిన సేవలను ప్రధాని కొనియాడారు. గతంలో ఆఫ్ఘనిస్థాన్, ఉక్రెయిన్, నేపాల్‌, శ్రీలంక, మాల్దీవుల్లోనూ భారత సహాయక బృందాలు విశేష సేవలందించాయని మోదీ కీర్తించారు. డాగ్ స్క్వాడ్ సామర్థ్యం పెరిగిందని మోదీ చెప్పారు. గుజరాత్ భూకంపవేళ 2001లో తాను వాలంటీర్‌గా సేవలందించానని, ఆ సమయంలో సేవలు ఎంత కష్టమో తనకు తెలుసన్నారు. విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న దేశాల్లో భారత జెండాతో సహాయక బృందాలు రాగానే బాధిత దేశాల ప్రజల్లో భరోసా పెరుగుతోందని, ఎన్డీఆర్ఎఫ్ కీర్తి నలుదిశలా వ్యాపిస్తోందని ప్రధాని ప్రశంసించారు.తుర్కియేసిరియాల్లో సేవలు ముగించుకుని భారత బృందాలన్నీ నిన్ననే న్యూఢిల్లీ చేరుకున్నాయి. నిన్న భారత బృందాలు స్వదేశానికి వస్తుండగా తుర్కియే సిరియాల్లో చాలా చోట్లా ప్రజలు చప్పట్లతో స్వాగతించారు. వరుసగా నిల్చుని చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కొందరైతే భారత సహాయక బృందాల వారితో ఆటోగ్రాఫ్‌లు కూడా తీసుకున్నారు.తుర్కియే, సిరియాల్లో రెండు వారాల క్రితం 7.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి లక్షల ఇళ్లు, భవనాలు నేల కూలాయి. వేలాది మంది శిథిలాల కింద చిక్కుకొని 46 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు.భూకంపం సంభవించిన వెంటనే ఆపరేషన్ దోస్త్ పేరిట భారత ప్రభుత్వం సహాయక బృందాలతో పాటు సహాయక సామాగ్రిని, ఔషదాలను పంపింది. డాగ్ స్క్వాడ్‌లను కూడా పంపించింది. నుర్‌దాగీ, అంటక్యా ప్రాంతాల్లో 12 రోజుల పాటు భారత సహాయక బృందాలు సేవలందించాయి. ఎన్డీఆర్ఎఫ్‌తో పాటు భారత సైన్యం కూడా వైద్య సేవల్లో పాలుపంచుకుంది. గాయపడ్డవారికి సైనిక డాక్టర్లు, నర్సులు సేవలందించారు. అనేకమంది ప్రాణాలు కాపాడారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అయితే రేయింబవళ్లూ శిథిలాలను తొలగిస్తూ అనేకమందిని కాపాడారు. తుర్కియే, సిరియా దేశాల సిబ్బందితో పాటు స్థానికుల సహకారం కూడా తీసుకుని అనేక మంది ప్రాణాలను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడారు. భారత సహాయక బృందాల సేవలను ఐక్యరాజ్యసమితి సహా అనేక దేశాలు మెచ్చుకున్నాయి.కష్టకాలంలో సత్వరమే స్పందించి సహాయక బృందాలను పంపినందుకు తుర్కియే, సిరియా భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపాయి. భూకంపవేళ రావాలనుకున్న పాక్ ప్రధానిని తుర్కియే వద్దంది.

Leave A Reply

Your email address will not be published.