వైసీపీ గూండాలకు పోలీసులు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు ఉంది

-  వైసీపీ శ్రేణులు దాడులు చేస్తుంటే పోలీసులు మౌనంగా చూస్తున్నారు - గన్నవరంలో టిడిపిపార్టీ శ్రేణులపై హింసాత్మక ఘటనలపై డీజీపీ కి చంద్రబాబు లేఖ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: గన్నవరంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులపై దాడులు, హింసాత్మక ఘటనలపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు డీజీపీ కి లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలు దొంతు చిన్నా పట్టాభి భద్రతకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ గూండాలకు పోలీసులు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు ఉందని, వైసీపీ శ్రేణులు దాడులు చేస్తుంటే పోలీసులు మౌనంగా చూస్తున్నారని మండిపడ్డారు. గన్నవరంలోని టీడీపీ ఆఫీస్‌ పై వైసీపీ రౌడీలు దాడి చేసి ధ్వంసం చేశారని, అక్కడ ఉన్న పలు వాహనాలకు నిప్పు పెట్టారన్నారు. దొంతు చిన్నాకు చెందిన పలు వాహనాలకు నిప్పు పెట్టారని, పట్టాభిని కొందరు వ్యక్తులు కిడ్నాప్‌ చేశారని ఆరోపించారు. పట్టాభిని పోలీసులు అరెస్ట్‌ చేశారా?.. లేక ఎవరైనా కిడ్నాప్‌ చేశారా?… నిందితులను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు ఆ లేఖలో పేర్కొన్నట్లు చంద్రబాబు తెలిపారు.కాగా గన్నవరంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. దీంతో పోలీసులు 144 సెక్షన్‌ విధిస్తూ.. పోలీస్‌ యాక్ట్‌ 30 అమలు చేస్తున్నారు. గన్నవరంలో దాడుల నేపథ్యంలో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. టీడీపీ, వైసీపీ కార్యాలయాల దగ్గర పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.గన్నవరంలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. విధ్వంసం సృష్టించాయి. గన్నవరం టీడీపీ కార్యాలయం పై వైసీపీ గుండాలు దాడి చేశారు. కార్యాలయంలోని కంప్యూటర్లు, ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా ఆఫీస్ ఆవరణలో ఉన్న వాహనాలపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. కత్తులతో టీడీపీ ఫ్లెక్సీలను వైసీపీ కార్యకర్తలు చించివేశారు. ఓ కారు అద్దాలను ఇటుకలతో బద్దలు కొట్టారు. పార్టీలో కార్యాలయంలో కలియతిరుగుతూ విధ్యంసం సృష్టించారు. ఈ దాడి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులే చేశారని టీడీపీ నేతలు చెబుతున్నారు. పోలీసులు ఉండగానే చూస్తుండగానే వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని చెబుతున్నారు. ఈ విషయంపై పోలీసులను అడిగితే సమాధానం చెప్పేందుకు నిరాకరించడం గమనార్హం. టీడీపీ నేతలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదని టీడీపీ నేతలు అంటున్నారు. పోలీసులు అలసత్వమే కారణమని వారు ఆరోపిస్తున్నారు.ఎమ్మెల్యే వంశీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడికి దిగినట్లు తెలుస్తోంది. దాడిలో 50-60 మంది అల్లరి మూకలు పాల్గొన్నారు. పోలీసుల సాక్షిగా వంశీ అనుచరుల విధ్వంసకాండకు దిగారని టీడీపీ నేతలు చెబుతున్నారు. మొదట టీడీపీ ఆఫీస్‌ దగ్గర ఎమ్మెల్యే వంశీ రెక్కీ నిర్వహించారని చెబుతున్నారు. వంశీపై ఫిర్యాదు చేయడానికి టీడీపీ నేతలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. టీడీపీ నేతలు వెళ్లిన వెంటనే కార్యాలయంపై వంశీ అనుచరుల దాడికి దాగారని చెబుతున్నారు. టీడీపీ కార్యాలయంలో ఎవరూ లేని సమయంలో వైసీపీ గూండాల దాడికి దిగారని టీడీపీ నేతలు అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.