ఢిల్లీ లిక్కర్ కేసులో ఆప్ కీలక నేత సిసోడియా అరెస్ట్
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్; ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్ కీలక నేత మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. సిసోడియాను దాదాపు 8 గంటలపాటు విచారించిన సీబీఐ రాత్రి 7:30 గంటల సమయంలో అరెస్ట్ చేసింది. కాగా అరెస్ట్ సమాచారాన్ని ఆయన కుటుంబ సభ్యులకు సీబీఐ అధికారులు అందించారు. ఇక సిసోడియా అరెస్ట్ నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులకు తావివ్వకుండా ఇటు సిసోడియా నివాసంతోపాటు సీబీఐ ప్రధాన కార్యాలయం పరిసరాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు.లిక్కర్ పాలసీ తయారీలో సిసోడియా కీలకపాత్ర పోషించారనే ఆరోపణలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు అప్పగించారనే అభియోగాలు ఉన్నాయి. బ్యూరోక్రాట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసులో ఇప్పటివరకు 12 మంది అరెస్టయ్యారు. ఇప్పటికే రాజేష్జోషి, విజయ్నాయర్, అమిత్ అరోరా, గౌతమ్, సమీర్మహేంద్రు, మాగుంట రాఘవ, శరత్చంద్రారెడ్డి, అభిషేక్ బోయినపల్లి, బినొయ్బాబు, బుచ్చిబాబు అరెస్టయ్యిన విషయం తెలిసిందే.