త్వరలో పెరగబోతున్న కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల జీతభత్యాలు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగుల ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను సవరించబోతోంది. దీంతో వారికి త్వరలోనే జీతభత్యాలు పెరగబోతున్నాయి. కనిష్ట జీతం రూ.18,000 నుంచి రూ.26,000 వరకు పెరుగుతుందని అంచనా. మార్చి 8న హోళీ పండుగ తర్వాత ఫిట్మెంట్ ఫ్యాక్టర్, డీఏ (కరువు భత్యం)లను పెంచబోతోందని ఇటీవల మీడియా కథనాలు వెల్లడించిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం కామన్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57 శాతంగా ఉంది. దీనిని 3.68 శాతానికి పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే జరిగితే కనీస వేతనం రూ.18,000 నుంచి రూ.26,000కు పెరుగుతుంది.ఏడో వేతన సవరణ సంఘం క్రింద ఉన్న కేంద్ర ప్రభుత్వోద్యోగులకు కూడా 2023 మార్చిలో డీఏ పెరిగే అవకాశం ఉందని మీడియా కథనాలనుబట్టి తెలుస్తోంది. ప్రభుత్వం పింఛనుదారులకు కూడా డియర్నెస్ రిలీఫ్ను పెంచే అవకాశం కనిపిస్తోంది. ఇవి కాకుండా, ఉద్యోగులు 18 నెలల డీఏ బాకీలను కూడా పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.డీఏ, డీఆర్లను సంవత్సరానికి రెండుసార్లు అంటే, జనవరి 1న, జూలై 1న సవరిస్తారు. 2022 సెప్టెంబరులో వీటిని పెంచడం వల్ల 48 లక్షల మంది ప్రభుత్వోద్యోగులు, 68 లక్షల మంది పింఛనుదారులు లబ్ధి పొందారు.