భారత్ మీద ఐక్యరాజ్యసమితి లో కైలాస ప్రతినిధుల ఫిర్యాదు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అసలు ఉందో లేదో కూడా అర్థంకానట్లుగా ఉండే కైలాస దేశానికి సంబంధించిన ప్రతినిధులమంటూ ఇద్దరు ఐక్యరాజ్యసమితి కమిటీ నిర్వహించిన బహిరంగ చర్చా వేదికలో భారత్ మీద వ్యక్తం చేసిన వ్యాఖ్యలపై యూఎన్ రియాక్టు అయింది. వివాదాస్పద అధ్యాత్మిక గురువు..అత్యాచారం..కిడ్నాప్ లాంటి పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద భారత్ నుంచి తప్పించుకొని వెళ్లిపోవటం తెలిసిందే.ఈక్వెడార్ తీరానికి దగ్గర్లో ఒక ద్వీపాన్ని కైలాస దేశంగా ప్రకటించుకొని.. తనకు తాను రెండు బిలియన్ల హిందువులకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా చెప్పుకోవటం ఒక ఎత్తు అయితే.. తాజాగా భారత్ పై ఆయన తన ప్రతినిదులుగా చెప్పుకుంటున్నవారిపై చేయించిన ఆరోపణలు సంచలనంగా మారాయి.
మరి.. దీనిపై ఐక్య రాజ్య సమితి రియాక్షన్ ఏమిటి? అసలు ఐక్యరాజ్యసమితి నిర్వహించే సమావేశంలో వారు ఎలా మాట్లాడారు? వారికి అనుమతులు ఎలా వచ్చాయి? కైలాస దేశానికి ఐక్యరాజ్యసమితి అధికారిక గుర్తింపు ఇచ్చిందా? అసలీ దేశం ఉందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సమాధానాలు వెతికితే.. మొదటగా ఐక్యరాజ్య సమితిలో కైలాస దేశానికి గుర్తింపు లేదు. అయితే.. ఐక్యరాజ్యసమితి నిర్వహించే బహిరంగ చర్చకు ఎవరైనా హాజరు కావొచ్చు.సరిగ్గా ఇదే పాయింట్ ను పట్టుకున్న కైలాస దేశ ప్రతినిధులు.. ఐక్యరాజ్యసమితి నిర్వహించిన సభకు వచ్చి.. భారత్ కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన యూఎన్.. తాము కైలాస దేశ ప్రతినిధుల వ్యాఖ్యల్ని పరిగణలోకి తీసుకోవటం లేదని స్పష్టం చేశారు. కొన్ని అంశాలపై ఐక్యరాజ్యసమితి బహిరంగ చర్చా వేదికలను ఏర్పాటు చేస్తుంది. అలాంటి చర్చా కార్యక్రమాన్ని తమ ఎజెండాను అమలు చేసేందుకు వీలుగా కైలాస దేశ ప్రతినిధులు  వాడుకున్నారని చెప్పాలి. సో.. కైలాస దేశ అధినేత హోదాలో నిత్యానంద కాస్తంత రచ్చ చేయటం.. వార్తల్లో నలగటం తప్పించి మరెలాంటి ప్రయోజనం ఉండదనే చెప్పాలి.

Leave A Reply

Your email address will not be published.