ప్రీతి కేసులో నోరు విప్పిన సైఫ్

- సంచలన విషయాలు వెలుగులోకి - కీలకంగా మారిన బ్యాగ్!

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బ్యూరో చీఫ్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కేఎంసీ పీజీ విద్యార్థిని ప్రీతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ప్రీతి విషయంలో అసలేం జరిగిందనే దానిపై నిందితుడు సైఫ్ పూసగుచ్చినట్లుగా పోలీసులకు చెప్పాడని విశ్వసనీయవర్గాల సమాచారం. శుక్రవారం నాడు సైఫ్‌ను పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. ఇప్పటి వరకూ నోరు విప్పని అతను.. ఇవాళ పోలీసులు తనదైన శైలిలో విచారించగా ఒక్కొక్కటిగా నిజాలు బయటికొచ్చాయట. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. సైఫ్ విచారణలో చెప్పిన విషయాలన్నింటినీ రికార్డ్ చేసుకున్న పోలీసులు.. ఆ ఆధారాలతో కీలక సమాచారం సేకరించారని తెలుస్తోంది.

పోలీసులు ఏం సేకరించారంటే..!

ఇప్పటికే డాక్టర్ ప్రీతికి సంబంధించిన రెడ్ మీ MI-10 లైట్ బ్లూ కలర్ ఫోన్ నుంచి సమాచారంతో వివరాలను పోలీసులు క్రోడీకరిస్తున్నారు. ఈ కేసులో ప్రీతి మొబైల్ నుంచి తీసిన 27 స్క్రీన్ షార్ట్స్ మెసేజ్‌లుకీలకంగా మారాయి. మెడికో నుంచి ఎల్‌డీడీ, నాకౌట్ వాట్సాప్‌ల గ్రూపు నుంచి-03, డాక్టర్ గాయత్రీ, డాక్టర్ సంధ్య వద్ద ఒక్కొక్కరి నుంచి-03 మెసేజ్‌లతో కీలక సమాచారం పోలీసులు సేకరించారని తెలుస్తోంది. అటు డాక్టర్ వైశాలి నుంచి-06, డాక్టర్ సంధ్య నుంచి- 10, డాక్టర్ స్పందన, నిందితుడు డాక్టర్ సైఫ్ నుంచి ఒక్కో చాట్‌ను పోలీసులు సేకరించి దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మొబైల్ టెక్నీషియన్ పెద్దోజు శివ చైతన్య సహాయంతో డాక్టర్ ప్రీతి చాటింగ్‌కు సంబంధించి కీలక ఆధారాలు పోలీసులు సేకరించారట.

ఇప్పుడు సైఫ్ వంతు..!

ఆ ఆధారాలన్నీ సేకరించిన తర్వాత ఈ సాంకేతిక ఆధారాలతో సరిపోల్చుతూ నిందితుడు డాక్టర్ సైఫ్‌ను పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 9 మంది అందించిన కీలక ఆధారాలతో నిందితుడు డాక్టర్ సైఫ్‌ను మరోసారి పోలీసు ఉన్నతాధికారులు విచారిస్తున్నారని సమాచారం. సంఘటనా స్థలం వద్ద ఉన్న ఎంజీఎం హెడ్ నర్స్ ఎల్లందుల సునీత, స్టాఫ్ నర్స్ చిన్నపల్లి కళా ప్రపూర్ణ నుంచి మరిన్ని వివరాలను పోలీసులు రాబట్టారట. సుదీర్ఘ విచారణ తర్వాత.. శనివారం మరోసారి పోలీసులు విచారిస్తారని తెలుస్తోంది.

కీలకంగా మారిన బ్యాగ్..!

అయితే ఈ విచారణ మొత్తమ్మీద ప్రీతి బ్లాక్ కలర్ షోల్డర్ బ్యాగ్ కీలకంగా మారిందని తెలియవచ్చింది. బ్యాగ్‌లోని మొత్తం 24 ఆధారాలతో కేసును పూర్తి స్థాయిలో పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. కేసులో మాజ కూల్ డ్రింక్  అనుమానాస్పదంగా మారింది. దీంతో పాటు లేస్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ గురించి కూడా తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎంజీఎం సెక్యూరిటీ గార్డులు రాజబోయిన సాంబరాజు, ఎర్రోజు కిశోర్‌ల నుంచి విచారణాధికారి కీలక వివరాలు సేకరించారని సమాచారం.

ఇలా మొత్తం అన్ని కీలక వివరాలను సేకరించిన పోలీసులు.. డాక్టర్ సైఫ్ నుంచి సేకరించిన సాంకేతిక ఆధారాలను పోల్చుతూ విచారణ కొనసాగిస్తున్నారు. అయితే విచారణలో ఏం జరుగుతోంది..? ఏం వివరాలు సేకరించారు..? కేసు ఎంతవరకు వచ్చింది..? అనే విషయాలు మాత్రం ఇంతవరకూ అధికారులు మీడియాకు సమాచారం ఇవ్వలేదు. మొత్తానికి చూస్తే చాలా గోప్యంగానే పోలీసులు విచారిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. అతి త్వరలోనే ఈ కేసు ఓ కొలిక్కి వస్తుందని ఆ తర్వాతే పోలీసు ఉన్నతాధికారులు మీడియా మీట్ నిర్వహించి పూర్తి వివరాలు వెల్లడిస్తారని తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.