ములాయం సింగ్ అంత్యక్రియలకు హాజరు కానున్న సీఎం కేసీఆర్

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ రేపు ఉత్తరప్రదేశ్‌ వెళ్లనున్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ అంత్యక్రియలకు హాజరుకానున్నారు. ఆయన పార్ధీవ దేహానికి నివాళులు అర్పించనున్నారు. ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌ యాదవ్‌ సోమవారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు అక్టోబ‌ర్ 11న ఆయ‌న స్వగ్రామం సాయ్‌ఫాయ్‌లో నిర్వహించ‌నున్నారు.
ములాయం మృతి పట్ల సీఎం కేసీఆర్‌ తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన ములాయం.. తన జీవితకాలం పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసమే పని చేశారని కొనియాడారు. ప్రముఖ సోషలిస్టు నాయకులు రామ్ మనోహర్ లోహియా, ప్రముఖ స్వతంత్ర సమరయోధులు రాజ్‌నారాయణ్ వంటి గొప్ప నేతల స్ఫూర్తితో ములాయం సింగ్ యాదవ్ రాజకీయాల్లోకి వచ్చారని సీఎం కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్, వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.