ఏపీలో బీజేపీకి ఆశా ‘కిరణ్’రెడ్డి .. అధిష్ఠానం ప్లానేంటి..!?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కిరణ్‌రెడ్డి పాలనాపరంగా మంచి అనుభవం ఉన్న వ్యక్తి. ఎమ్మెల్యే, స్పీకర్.. ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన అపార అనుభవం ఉంది. వైఎస్, కల్వకుంట్ల ఫ్యామిలీలు రాజకీయాల్లోకి రాకముందే నల్లారి కుటుంబం రాజకీయాల్లో ఉంది. ఇందిరాగాంధీ హయాం నుంచి తెలుగు రాష్ట్రాల నేతలతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్ ఒక్కటే అని కాదు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, వైసీపీ.. లోని నేతలతో మంచి పరిచయాలున్నాయి. ఇందులో కిరణ్‌రెడ్డికి అత్యంత ఆప్తులు కూడా ఉన్నారు. నేతలు పార్టీలు మారారు కానీ.. ఈయనతో టచ్‌లోనే ఉంటూ వస్తున్నారు. ఇందుకు ఈ మధ్య జరిగిన ఒకట్రెండు ఇంటర్వ్యూలు చూస్తే అర్థమవుతుంది. కిరణ్ బీజేపీలో చేరితే తెలుగురాష్ట్రాల్లో ఈయనకున్న అనుభవాన్ని వాడుకోవాలన్నదే కమలనాథుల మెయిన్ ప్లానట. అదెలాగంటే.. కిరణ్ రెడ్డితో కలిసి పనిచేసిన చాలా మంది సీనియర్లు, మేథావులు, కీలక నేతలంతా ఇప్పుడు రాజకీయాల్లో పెద్దగా కనిపించట్లేదు. ఈయన వచ్చీ రాగానే వారందరికి కాషాయ కండువా కప్పే పనిని అప్పగించబోతున్నారట. అంటే.. నాడు ఓ వెలుగు వెలిగిన నేతలంతా బీజేపీలో చేర్పించే కీలక బాధ్యతలు కిరణ్‌రెడ్డికి అప్పగించబోతున్నారన్న మాట. దీంతో పాటు.. తెలుగు రాష్ట్రాల్లోని అధికార, ప్రతిపక్ష పార్టీల్లోని ముఖ్యనేతలతో మంచి రాజకీయ పరిచయాలే కిరణ్‌కు ఉన్నాయి. దీన్ని కూడా క్యాష్ చేసుకోవాలని కమలనాథులు భావిస్తున్నారట.

రాయలసీమ బాధ్యతలు..!

ఇక పార్టీ పరంగా వస్తే.. గ్రౌండ్ లెవల్‌ నుంచి ముఖ్యంగా రాయలసీమలో పార్టీని బలోపేతం చేయడానికి ఈయన సేవలను బీజేపీ ఉపయోగించుకోబోతోందని టాక్ నడుస్తోంది. వాస్తవానికి ప్రస్తుతం రాయలసీమ బీజేపీలో సరైన నాయకుడు లేరన్నది బీజేపీ భావనట. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఈయన్ను ముందుపెట్టి రాయలసీమ మొత్తం రాజకీయం నడపాలని పార్టీ భావిస్తోందట. ఎందుకంటే.. సీమలో రెడ్డి సామాజిక వర్గానికే ప్రాబల్యం ఎక్కువ. పైగా ఇప్పుడు ఏపీ సీఎంగా ఉన్న వైఎస్ జగన్‌రెడ్డిని రాయలసీమ వరకు ఢీ కొనడానికి మరో రెడ్డి అయిన కిరణ్ మాత్రమే అందుకు సరైన వ్యక్తని బీజేపీ భావిస్తోందట. అంటే రెడ్డిని రెడ్డితోనే ఢీ కొట్టించబోతోందన్న మాట. ముఖ్యంగా ఇప్పుడు ఏపీలో బీజేపీకి సరైన నాయకత్వం లేదనేది ఢిల్లీ పెద్దల మాట. సరిగ్గా ఇదే సమయంలో కిరణ్‌రెడ్డినే బీజేపీ ‘ఆశాకిరణం’గా భావిస్తోందట. రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి గనుక పార్టీలో ఉంటే ఎలాంటి సమస్యలు ఎదురైనా ఎదురొడ్డి నిలబడతారని.. ముఖ్యంగా నేతల మధ్య ఎటువంటి సమస్యలు వచ్చినా పరిష్కరించగలుగుతారని బీజేపీ పెద్దలుగా గట్టిగా నమ్ముతున్నారట.

కిరణ్‌రెడ్డి ఏం ఆశిస్తున్నారు..?

వాస్తవానికి బీజేపీలో నిబద్ధతతో పనిచేసే నాయకులకు కచ్చితంగా గుర్తింపు ఉంటుందని ఆ పార్టీలో పనిచేసిన.. పనిచేస్తున్న పెద్దలు చెబుతున్న మాట. ఇందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురికి ప్రాధాన్యత ఇవ్వడమే దీనికి చక్కటి ఉదాహరణ. సీఎంగా పనిచేసిన కిరణ్ కొత్త పార్టీ పెట్టారు కానీ అట్టర్ ప్లాపే అయ్యింది. తర్వాత ఈయన క్రియాశీల రాజకీయాల్లో లేరు. ఏడాది కిందట మళ్లీ కాంగ్రెస్‌లో చేరి కాస్త హడావుడి చేశారు కానీ.. ఈయన వ్యూహాలేమీ పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. ఇప్పుడున్న టీడీపీ, వైసీపీలో చేరాలని ఆయన భావిస్తే కచ్చితంగా రెడ్ కార్పెట్‌తోనే స్వాగతాలు వస్తాయి. జాతీయ పార్టీ నుంచి అదే రేంజ్‌ ఉన్న పార్టీలో చేరాలని కిరణ్‌రెడ్డి భావించే ఈ నిర్ణయం తీసుకున్నారట. ఈయనకు మంచి సిన్సియారిటీ ఉన్న వ్యక్తిగా, నమ్మినబంటుగా పేరుంది. అందుకే ఈయన్ను ఏరి కోరి మరీ కాంగ్రెస్ పెద్దలు అప్పట్లో సీఎం సీట్లో కూర్చోబెట్టారన్నది అప్పట్లో కొందరు సన్నిహితులు చెప్పిన మాట. అందుకే అదే సిన్సియారిటీతో బీజేపీలో కూడా పనిచేస్తే కచ్చితంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంటుందని.. పార్టీకి కూడా కావాల్సింది అదేనని కిరణ్ రెడ్డి భావిస్తున్నారట. ఒకవేళ రాష్ట్రస్థాయిలో ఆశించిన రీతిలో పదవులు లేకపోయినా కేంద్రంలో మాత్రం కచ్చితంగా పెద్దలు పదవులు కట్టబెడతారని ఆశ మాత్రం ఉందట. అంటే కేంద్రంలో పదవులు అనుభవించి మునుపటి చరీష్మాతో ఓ వెలుగు వెలగాలని గట్టిగానే కిరణ్ కలలు కంటున్నారట.మొత్తానికి చూస్తే.. బీజేపీకి కిరణ్ రెడ్డి అవసరం ఎంతుందో.. అంతకుమించి కిరణ్‌కు కూడా కమలం పార్టీతో అంతే అవసరం ఉందనేది దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. మరి ఎవరు ఎవర్ని ఎలా ఉపయోగించుకుంటారో వేచి చూడాలి మరి.

Leave A Reply

Your email address will not be published.